దూసుకొచ్చిన మృత్యువు  | Container rams into pedestrians in Patancheru | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు 

May 10 2019 10:27 AM | Updated on May 11 2019 2:21 AM

Container rams into pedestrians in Patancheru - Sakshi

పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో పాదాచారులపైకి కంటేయినర్ దూసుకుపోయింది.

పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిపైకి కంటెయినర్‌ లారీ దూసుకువచ్చింది. ఆగి ఉన్న మరో కంటెయినర్‌ లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.  నాగాలాండ్‌కు చెందిన దానేశ్వర్‌ దాస్, అస్సాం రాష్ట్రానికి చెందిన ఉతోపన్‌ పెగు, బాబు బోరి, బిష్వజిత్‌ పెగు బతుకుదెరువు కోసం జిల్లాలోని ఇస్నాపూర్‌కు వచ్చి స్థానిక మహేశ్వర్‌ ఆసుపత్రి సమీపంలో ఉంటూ హిండ్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం దానేశ్వర్‌ దాస్, ఉతోపన్‌ పెగు, బాబు బోరి, బిష్వజిత్‌లు వారి స్నేహితుడైన అస్సాం కు చెందిన మంజన్‌ పెగుతో కలసి కిరాణా సామాను తీసుకోవడానికి ఇస్నాపూర్‌ చౌరస్తాకు నడుచుకుం టూ వస్తున్నారు.

వారు ప్రముఖ్‌నగర్‌ కాలనీ సమీపంలో ఆగి ఉన్న కంటెయినర్‌ పక్క నుంచి వెళుతుండగా అదే సమయంలో వెనకాల నుంచి దూసుకువచ్చిన మరో కంటెయినర్‌ లారీ వీరిని ఢీకొట్టింది. అదే వేగంలో పక్కనే ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కూడా ఢీకొంది. దీంతో కంటెయినర్‌ డ్రైవర్‌ వెంకటేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఢీకొన్న కంటెయినర్‌ క్లీనర్‌ గోవింద్‌ మానేకు కూడా తీవ్ర గాయాలయ్యా యి.  దానేశ్వర్‌ దాస్‌(19), ఉతోపన్‌ పెగు (25) అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో డ్రైవర్‌ వెంకటేశ్, క్లీనర్‌ గోవింద్‌ మానే, మంజన్‌ పెగును చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బాబు బోరి, బిష్వజిత్‌లను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా, ప్రథమ చికిత్స చేసి వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దానేశ్వర్‌ దాస్, ఉతోపన్‌ పెగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement