మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్‌

Congress Senior Leader V Hanumantha Rao Tested Corona Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా ఇటీవలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వందమందికి దుప్పట్ల పంపిణీ చేశారు. అదే రోజు నుంచి వీహెచ్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. లాక్‌డౌన్‌ కాలంలోనూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. (రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం)

ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి మెలిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌, బీగాల గణేష్‌ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్నారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top