నాన్న దుబాయ్‌లో.. అమ్మ ఆసుపత్రిలో..

Children Died In Kondagattu Bus Accident Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల (కరీంనగర్‌): రెండేళ్ల వయసు. తండ్రి దుబాయిలో ఉంటున్నాడు. కొడుక్కి ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రిలో చూపించాలని బస్సులో బయల్దేరింది ఆ తల్లి. దురదృష్టం వెంటాడి కొడుకు ప్రాణాలు బలితీసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులు కడచూపునకు కూడా నోచుకోలేదు. చివరికి బంధువులే అంత్యక్రియలు జరిపించారు. ఈ హృదయవిదారక సంఘటన అందరినీ కలచివేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేటకు చెందిన గాజుల అశోక్, లత దంపతులు. వీరికి కూతురు శ్రీవాణి, కొడుకు హర్షవర్ధన్‌ (2) ఉన్నారు. అశోక్‌ ఏడాది క్రితం ఉపాధి కోసం దుబాయ్‌  వెళ్లాడు. హర్షవర్ధన్‌ ఆరోగ్యం బాగలేకపోవగడంతో లత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కింది.

కొండగట్టు ఘాట్‌ వద్ద జరిగిన ప్రమాదంలో లత కాలు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి.  హర్షవర్ధన్‌ అక్కడికక్కడే చనిపోయాడు. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి దుబాయ్‌లో ఉండిపోయాడు. బుధవారం బంధువులే అంత్యక్రియలు జరిపించారు. పది రోజుల క్రితమే రాఖీ కడితే అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఇచ్చాడని హర్షవర్ధన్‌ అక్క శ్రీవాణి గుర్తు చేసుకుంటూ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top