పదవులకు రాజీనామా చేసి పార్టీలు మారాలి
ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలోకి మారడం నైతిక విలువలులేని రాజకీయాలకు..
చేవెళ్ల: ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరోపార్టీలోకి మారడం నైతిక విలువలులేని రాజకీయాలకు నిదర్శనమని, అనుభవిస్తున్న పదవులకు రాజీనామాలు చేసి పార్టీలు మారితే బాగుంటుందని జిల్లా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో శనివారం మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ పి.గోపాల్రెడ్డి, న్యాలట మాజీ సర్పంచ్ పి.బాలయ్య తదితర నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. ఒకపార్టీ గుర్తుపై గెలిచి తమ స్వార్థం కోసం ప్రజలను మోసం చేస్తూ పార్టీలు మారడం తగదన్నారు.
కాంగ్రెస్నుంచి గెలిచి శుక్రవారం టీఆర్ఎస్లో చేరిన మొయినాబాద్ జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్తోపాటు ఇటీవల పార్టీ మారిన నాయకులంతా పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. పార్టీలు మారే సాంప్రదాయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులే ప్రోత్సహించడం సబబు కాదన్నారు. ఆరు నెలల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనందునా రానున్న రోజులు కాంగ్రెస్వేనని ధీమా వ్యక్తంచేశారు.


