హామీల అమలులో కేసీఆర్‌ విఫలం | BJP Candidate Election Campaign, Warangal | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కేసీఆర్‌ విఫలం

Nov 30 2018 9:34 AM | Updated on Nov 30 2018 9:34 AM

BJP Candidate Election Campaign, Warangal - Sakshi

సభావేదిక పైనుంచి అభివాదం చేస్తున్న పరిపూర్ణానందస్వామి, కీర్తిరెడ్డి తదితరులు

సాక్షి, మొగుళ్లపల్లి: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు మంజూరుచేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ సోకులు పడుతున్నాడు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాడని బీజేపీ ప్రచార ఇన్‌చార్జి, జాతీయ నాయకుడు పరిపూర్ణానందస్వామి విమర్శించారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధి మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపాన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ధర్మస్థాపన యాత్ర బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు వేలమందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, రైతు బంధు పథకం భూస్వాములకు మాత్రమే లాభం చేకూర్చిందన్నారు. కేసీఆర్‌ అబ ద్దాల కోరు.. లక్ష ఉద్యోగాలన్నాడు.. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు.. పేదలకు డబుల్‌ బెడ్రూంలు ఇస్తానని చెప్పాడు.. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తానన్నాడు.. ఇందులో ఏఒక్కటీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

నిల్వబడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా తయారు చేశాడని, అవినీతిలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలయ్యే పథకాల్లో కేంద్రం వాటే సింహభాగం ఉందని చెప్పారు. దేశ ప్రధాని మోదీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్ధేశంతో ఆయుష్మాన్‌భారత్‌ పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నా రు. అధికారంలోకి రాగానే ఆరు నెలలలోపు ఏక కాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయడంతోపాటు లక్షాఉద్యోగాలు కల్పిస్తామని చెప్పా రు. రాష్ట్రంలో 70 స్థానాల్లో తమ పార్టీ జెండా ఎగుర వేసి మోదీకి కానుకగా ఇస్తామని చెప్పారు. మహాకూటమి కాదు.. అది దొంగల కూటమి అని పరిపూర్ణానంద అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చదువు రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, సత్యపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రఘునందన్‌రావు, మాధవ్, వెదిరె శ్రీరాం, రాష్ట్ర నాయకులు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెం యుగంధర్, భూపాపల్లి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎరుకల గణపతి, పార్టీ మండల అధ్యక్షుడు మోరె రవీందర్‌రెడ్డి, బీపేవైఎం జిల్లా అధ్యక్షుడు ఉద్దమూరి మహేష్, జిల్లా నాయకులు చెవ్వ శేషగి రి, కుమ్మరి లచ్చమ్మసారయ్య, కేతిపెల్లి శీరిషతిరుపతిరెడ్డి, ప్రసాధ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గత పాలకులు దోచుకుతిన్నారు..
గత పాలకులు నియోజకవర్గాన్ని దోసుకుతిన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నీచరాజకీయాలు చేస్తున్నాయి. మొగుళ్లపల్లి పెద్దవాగులో చుక్క నీరు లేదుకానీ.. ఆయా పార్టీల నాయకుల గోదాముల్లో మద్యం ఏరులై పరుతోంది. 2009లో రమణారెడ్డి గెలించి పెట్రోలు పంపులు, భూకబ్జాలు అవినీతికి పాల్పడి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు. నియోజకవర్గంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి రమణారెడ్డికి చెమటలు పుడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర వాటనే ఎక్కువగా ఉంది. ఆ పార్టీ చెప్పే మాటలకు మోసపోకుండా బీజేపీని గెలిపించాలి. ఆదరిస్తే అందరికి అందుబాటుతో ఉండి అవినీతి లేని పాలనను అందిస్తాను. – బీజేపీ భూపాలపల్లి అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి  

Advertisement
 
Advertisement
Advertisement