బాన్సువాడకే పెద్దాస్పత్రి! | Banswada area hospital level should be increased | Sakshi
Sakshi News home page

బాన్సువాడకే పెద్దాస్పత్రి!

Dec 8 2014 3:13 AM | Updated on Aug 15 2018 9:04 PM

ఎనిమిది మండలాలకు కూడలిగా ఉన్న బాన్సువాడ ఏరియా ఆసుపత్రి స్థాయిని పెంచాలనే డిమాండ్ నెరవేరబోతోంది.

బాన్సువాడ : ఎనిమిది మండలాలకు కూడలిగా ఉన్న బాన్సువాడ ఏరియా ఆసుపత్రి స్థాయిని పెంచాలనే డిమాండ్ నెరవేరబోతోంది. జిల్లా ఆస్పత్రిని ఎట్టకేలకు బాన్సువాడకు తరలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌లో వైద్య కళాశాల ఏర్పాటు అయినందున జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఎక్కడికి తరలించాలనే అంశంపై ఏడాది కాలంగా సం దిగ్ధత నెలకొన్న విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దీనిని బోధన్ తరలించేందుకు అప్పటి మంత్రి సుదర్శన్‌రెడ్డి విఫలయత్నం చేశారు.

ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్జి తీవ్ర యత్నాలతో ఆసుపత్రి బాన్సువాడకే  కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు మంత్రి ద్వారా తెలిసింది. మంత్రి పోచారంతోపాటు ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంతు సింధే  కేసీ ఆర్‌ను కలిసి, బాన్సువాడలో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏర్పాటు చేస్తే జరిగే లాభాలు, గ్రామీణ ప్రజలకు అందే వైద్య సౌకర్యాలపై సమగ్రంగా చర్చించి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం
జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడకే జిల్లా కేంద్ర ఆసుప్రతిని తరలించాలని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌తో పాటు మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గాల ప్రజలు గత కొం తకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆసుపత్రిని జిల్లా కేంద్రం నుంచి 28 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్‌కు తర లిస్తే ప్రయోజనం ఉండదని, కేవలం బోధన్ సెగ్మెం ట్ ప్రజలకే సేవలు అందుబాటులో ఉంటాయని చెబు తూ వచ్చారు. నాలుగు నియోజకవర్గాలకు కూడలిగా ఉన్న బాన్సువాడలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు అందరికీ అందుబాటులో ఉంటుందని వాదించారు.

ఇక్కడ ఆస్ప త్రి ఏర్పాటుకు అనువైన స్థలం కూడా ఉంది. ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ఉండగా, ఆసుపత్రికి ఎదురుగానే ఐడీసీఎంఎస్‌కు చెందిన సుమారు ఏడు ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఆసుప్ర తి భవనంపై మరో రెండు, మూడు అంతస్తులను పెంచడానికి వీలుంటుంది. బోధన్, ఆర్మూర్ నిజామాబాద్‌కు దగ్గరగా ఉండడం, కామారెడ్డి హైదరాబాద్‌కు సమీపం లో ఉన్నందున ఆయా ప్రాంతాలకు ఆసుపత్రిని తరలిం చడంతో ప్రయోజనం ఉండదు. మారుమూల ప్రాంతమై న బాన్సువాడకే ఆసుపత్రిని తరలిస్తే అందరికీ ఉపయోగ కరంగా ఉంటుంది.

ఆసుపత్రిలో మెరుగైన సేవలు
ఇప్పటికే అత్యధిక రోగులకు వైద్య సేవలందించి, వివిధ వ్యాధులకు సంబంధించిన చికిత్స చేసిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి జిల్లా కేంద్ర ఆస్పత్రి సరసన చేరింది. మూడేళ్ల క్రితం వైద్య ఆరోగ్య శాఖ ఏరియా ఆస్పత్రులలో అందుతున్న సేవలపై గ్రేడింగ్ చేయగా, బాన్సువాడ ఆసుపత్రి ‘ఎ’ గ్రేడ్ సాధించింది. రోజూ దాదాపు 800     నుంచి 1000 మంది వరకు ఔట్ పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement