29 గొర్రెలు మృత్యువాత  

29 Sheeps Died In Road Accident - Sakshi

ఆదుకోవాలని మంగనూరు గ్రామ కాపరుల వేడుకోలు

పరామర్శించిన  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

బిజినేపల్లి రూరల్‌(నాగర్‌కర్నూల్‌) :  రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలను ఓ లారీ నలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు... మంగనూర్‌ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శివయ్య, మాసయ్య, శ్రీను, పర్వతాలుకు ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను అందజేసింది. స్థానికంగా మేత లేకపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకోవాలని నలుగురు గ్రామం నుంచి సోమవారం బయల్దేరారు.

మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పాలెం సమీపంలో వెళ్తుండగా, ఓ లారీ మందపైకి దూసుకొచ్చింది. దీంతో మందలోని 29 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటనపై కాపరుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు కావడంతో పశువైద్యాధికారులు అక్కడికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కాపరులు వేడుకున్నారు. గొర్రెల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.   

కాపరులను పరామర్శించిన ఎమ్మెల్యే  

విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాపరులకు రూ.15వేల ఆర్థిక సాయం అంది ంచా రు. ప్రభుత్వం నుంచి బీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీను సంఘటనా స్థలంలో గొర్రెల కాపరులతో మాట్లాడారు.

కాపరులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ రాములు, పశువైద్య అధికారి బుచ్చమ్మ, ఎంపీటీసీ మనోహర్, మాజీ ఎంపీపీ బాలీశ్వర్, జాలం నాగయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కిరణ్, బాలస్వామి, ఎల్లస్వామి, తిరుమల్‌యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top