సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14వ తేదీ నుంచి జరుగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18వేల మంది పోలీసులు అవసరమవుతారని గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు.
- -పుష్కర స్నానాలకు తరలిరానున్న లక్షలాది మంది భక్తులు
- -స్థానిక భాషల్లోనే భక్తులకు సూచనలు ఇవ్వాలన్న డీజీపీ
- -బందోబస్తుపై ఐదు జిల్లాల ఎస్పీలు, డీఐజీలతో డీజీపీ అనురాగ్ శర్మ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 14వ తేదీ నుంచి జరుగనున్న గోదావరి పుష్కరాల పర్యవేక్షణ, బందోబస్తుకు 18వేల మంది పోలీసులు అవసరమవుతారని గుర్తించినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. ఐదు జిల్లాల పరిధిలో జరిగే పుష్కరాలకు స్థానిక పోలీసులతో పాటు ఇతర జిల్లాలు, కర్నాటక నుంచి పోలీసులను రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు. డీజీపీ అనురాగ్శర్మ మంగళవారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎస్పీలు, సంబంధిత డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు జిల్లాల పరిధిలో 106 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తుండగా, లక్షల సంఖ్యలో భక్తులు వ చ్చే అవకాశాలున్నాయని తెలిపారు. భద్రాచలం, ధర్మపురి, కాలేశ్వరం, బాసరకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయని అన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని , పబ్లిక్ అడ్రస్ సిస్టంను అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఏర్పాటు చేసి భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. స్థానిక భాషల్లో భక్తులకు సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కోయ ప్రజలు వాడే భాషలో సూచనలు అందించాలన్నారు.
వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటలిజెన్స్ ఐజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ గత పుష్కరాల సమయంలో అదిలాబాద్ ఎస్పీగా తాను భగవంతుని సేవలో భక్తులు... భక్తుల సేవలో పోలీసులు’ అనే శీర్షికతో బ్యానర్లు ఏర్పాటు చే సిన విషయాన్ని గుర్తు చేశారు. భక్తులకు సేవలు అందించే మంచి అవకాశం పోలీసులకు ఇదని పేర్కొన్నారు. శాంతి భద్రతల అదనపు డీజీపీ సుదీప్ లక్తకియ మాట్లాడుతూ భద్రతా పరంగాపోలీసు శాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. వీరికి వసతి, భోజనం ఏర్పాట్లు సరిగా చూడాలని ఎస్పీలను ఆదేశించారు. స్ట్రాంగ్ బ్యారికేటింగ్ ఏర్పాటు చేయాలని, భక్తులు క్యూలైన్లలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చూడాలన్నారు. వీఐపీ భద్రతా కూడా ముఖ్యమేనని, క్రైం పార్టీ, ఆర్ముడ్ పికెట్స్, కంట్రోల్ రూమ్స్, వాచ్ టవర్స్ ఏర్పాటు చేసుకోవాలని లక్తకియా సూచించారు. కమ్యూనికేషన్ అదనపు డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ పోలీస్ సిబ్బందికి కావలసిన హ్యాండ్ సెట్స్, రిపీటర్స్తో పాటు కమ్యూనికేషన్స్కు సంబంధించిన అన్ని పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని పుష్కరాల కోసం వినియోగించుకొని అనంతరం తమ కార్యాలయంలో అందజేయాలని అన్నారు. వీడియో కన్ఫెరెన్స్లో ఐజీ నవీన్ చంద్, సంజయ్ కుమార్ జైన్, డీఐజీ గంగాధర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.