నగరాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ కోరారు. ఆయన ఆదివారం స్థానిక బాలుర ప్రభుత్వ పీయూ
సింధనూరు టౌన్, న్యూస్లైన్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ కోరారు. ఆయన ఆదివారం స్థానిక బాలుర ప్రభుత్వ పీయూ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. నగరంలో డ్రెయినేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా నిధులు మంజూరు చేయాలని మనవి చేశారు. సింధనూరు - మస్కి రహదారి అభివృద్ధికి కూడా రూ.100 కోట్లు అందించాలని కోరారు.
ఈ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని అన్నారు. మొదటి సారిగా రైతుల సముదాయానికి ప్రాధాన్యత కల్పించాలని, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాలకు పైగా నీటిపారుదల భూములు ఉన్నాయని తెలిపారు. తుంగభద్రా జలాశయంలో 30 టీఎంసీల మేర పూడిక నిండి ఉందని, దీంతో ఎడమ కాలువకు రెండవ పంటకు నీరు లభించడం కష్టసాధ్యమని వెల్లడించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. తుంగభద్రా వరద నీటిని ఉపయోగించుకునే విధంగా పథకాలను రూపొందించాలన్నారు. ఈ పథకానికి సుమారు 6-8 వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఏటేటా సమస్యలు తగ్గుముఖం అవుతాయని వెల్లడించారు.
నగరంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింధనూరు విధానసభ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ లేరని, అయితే మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను ఎంపిక చేశారని, ప్రజల ఆశయాలకనుగుణంగా తగిన అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.