‘అన్న భాగ్య’ విస్తరణ | 'The fortunes' expansion | Sakshi
Sakshi News home page

‘అన్న భాగ్య’ విస్తరణ

Aug 24 2013 2:10 AM | Updated on Sep 1 2017 10:03 PM

రాష్ర్టంలో రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ కింద రాగులు, జొన్నలు, గోధుమలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది.

 సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో రూపాయి కిలో బియ్యం పథకం ‘అన్న భాగ్య’ కింద రాగులు, జొన్నలు, గోధుమలను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. అక్టోబరు నుంచి చౌక దుకాణాల్లో వీటి పంపిణీ ప్రారంభమవుతుంది. రాగులు, జొన్నలు, గోధుమలు వద్దనుకున్న వారు బియ్యం తీసుకోవచ్చు. విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ.  జయచంద్ర సమావేశం వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఉత్తర కర్ణాటకలో అన్న భాగ్య కింద 10 కిలోల బియ్యం పొందుతున్న వారు ఇకపై నాలుగు కిలోల బియ్యం,  రెండు కిలోల గోధుమ, నాలుగు కిలోల జొన్నలను తీసుకోవచ్చు. ఇరవై కిలోల బియ్యం తీసుకుంటున్న వారు 11 కిలోల బియ్యం, మూడు కిలోల గోధుమలు, ఆరు కిలోల జొన్నలను పొందవచ్చు. 30 కిలోల బియ్యం బదులుఐదు కిలోల గోధుమలు, ఎనిమిది కిలోల జొన్నలు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు.

దక్షిణ కర్ణాటకకు చెందిన వారికి జొన్నల స్థానంలో రాగులను అందిస్తారు. 10 కిలోల బియ్యం పొందే కుటుంబాలు కిలో గోధుమలు, రెండు కిలోల రాగులు, ఏడు కిలోల బియ్యం పొందవచ్చు. 20 కిలోల బియ్యం బదులు రెండు కిలోల గోధుమలు, మూడు కిలోల రాగులు, 15 కిలోల బియ్యం తీసుకోవచ్చు. 30 కిలోల బియ్యం బదులు మూడు కిలోల గోధుమలు, అయిదు కిలోల రాగులు, 22 కిలోల బియ్యం పొందవచ్చు.
 
 ఇతర నిర్ణయాలు
 
 = గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోవధ నిషేధ ముసాయిదా బిల్లుల ఉపసంహరణ
 
 = బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ చార్జీల పెంపునకు అనుమతి
 
 = కోలారు వద్ద రైల్వే బోగీల తయారీ కర్మాగారం కోసం రాష్ట్ర వాటాగా రూ.100 కోట్ల విడుదలకు అంగీకారం. ప్రైవేట్ భూ సేకరణకు ఆదేశాలు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement