చెరువుల పునరుద్ధరణ | Lakes Restoration | Sakshi
Sakshi News home page

చెరువుల పునరుద్ధరణ

Aug 8 2013 4:22 AM | Updated on Sep 1 2017 9:42 PM

రాష్ట్రంలో చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

 సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల చెరువులకు గాను తొలి దశలో 12 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. దీనికి ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు. గ్రామీణ చెరువుల పునరుద్ధరణపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విధాన సౌధలో ఏర్పాటు చేసినవర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. అన్ని చెరువులను ఒకే సారి పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారు. కనుక దశలవారీ చేపడతామన్నారు. 
 
చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తుందని తెలిపారు. కనుక పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. సుమారు 4,500 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై సర్వే చేయించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. చెరువుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు.   వర్క్‌షాపునకు అధ్యక్షత వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో 12 వేల చెరువుల పునరుద్ధరణను పూర్తి చేస్తామని వెల్లడించారు.
 
 ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున చెరువులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు నడుం బిగించాలని కోరారు. దీనికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. పర్యావరణవేత్త యల్లప్ప రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్‌లో శుద్ధమైన తాగు నీటి సరఫరా వ్యవస్థ ఉందన్నారు. అలాంటి వ్యవస్థ మరెక్కడా లేదన్నారు. మనం నది నీటిని వాడుతున్నప్పటికీ రెండు వారాలకోసారి పర్యావరణం, వాతావరణంలో మార్పు జరుగుతూనే ఉందని, దీని ప్రభావం నీటిపై ఉంటుందని ఆయన అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement