భారత అండర్‌–19 జట్ల శుభారంభం

U 19 cricket  India A And B off to winning starts - Sakshi

రాణించిన తిలక్‌ వర్మ, రాహుల్‌

తిరువనంతపురం: నాలుగు జట్ల అండర్‌–19 వన్డే సిరీస్‌లో ఆతిథ్య భారత్‌ ‘ఎ’... ‘బి’ జట్లు శుభారంభం చేశాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్‌–19 ‘ఎ’ జట్టు 157 పరుగుల తేడాతో... అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ‘బి’ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ బృందం సరిగ్గా 50 ఓవర్లలో 251 పరుగులు సాధించింది. కమ్రాన్‌ ఇక్బాల్‌ (60; 3 ఫోర్లు), శాశ్వత్‌ రావత్‌ (64; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 35.4 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది. భారత ‘ఎ’ బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్‌ష దూబే మూడేసి వికెట్లు తీశారు.

 అఫ్గానిస్తాన్‌తో పోరులో భారత ‘బి’ జట్టు 107 పరుగుల లక్ష్యాన్ని 22.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. హైదరాబాద్‌ ఆటగాడు, ఓపెనర్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ (70 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు), రాహుల్‌ చంద్రోల్‌ (51 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో... తిలక్‌ వర్మ, రాహుల్‌ క్రీజులో నిలదొక్కుకొని అభేద్యంగా 102 పరుగులు జోడించి భారత్‌ విజయాన్ని ఖాయం చేశారు. అంతకుముందు అఫ్గానిస్తాన్‌ జట్టు 47.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. భారత ‘బి’ బౌలర్లలో పూర్ణాంక్‌ త్యాగి (4/36), ప్రయాస్‌ రే బర్మన్‌ (3/10), అథర్వ (2/18) ఆకట్టుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top