షూటింగ్‌లో తెలంగాణకు కాంస్యం | TRS shooting bronze | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో తెలంగాణకు కాంస్యం

Feb 4 2015 12:49 AM | Updated on Sep 2 2017 8:44 PM

జాతీయ క్రీడల్లో మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క పతకమే దక్కింది. షూటింగ్ విభాగంలో తెలంగాణ కాంస్యంతో సంతృప్తిపడింది.

టెన్నిస్‌లో ఫైనల్‌కు
 జాతీయ క్రీడలు

 
 
 తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక్క పతకమే దక్కింది. షూటింగ్ విభాగంలో తెలంగాణ కాంస్యంతో సంతృప్తిపడింది. మంగళవారం జరిగిన ట్రాప్ ఈవెంట్‌లో కైనన్ చినాయ్, డారిస్ చినాయ్, గౌతమ్‌లతో కూడిన పురుషుల జట్టు 314 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా తెలంగాణ ఖాతాలో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు ఉన్నాయి. ఏపీ ఖాతాలో ఓ స్వర్ణం, ఓ రజతం, రెండు కాంస్యాలున్నాయి.  
 
 టెన్నిస్‌లో టైటిల్ పోరుకు
 పురుషుల టెన్నిస్‌లో తెలంగాణ జట్టు 2-0తో మహారాష్ట్రపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో విష్ణు వర్ధన్ 6-4, 7-6 (6)తో షాహబాజ్‌పై; రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని 7-6 (9), 6-3తో ఆకాశ్ వాఘ్‌పై నెగ్గారు. ఫైనల్లో తెలంగాణ జట్టు... తమిళనాడుతో తలపడుతుంది. మహిళల కేటగిరీలో తెలంగాణ 2-1తో తమిళనాడును ఓడించింది. తొలి సింగిల్స్‌లో సౌజన్య భవిశెట్టి 6-4, 6-1తో రష్మీ చక్రవర్తిపై గెలవగా; రెండో సింగిల్స్‌లో నిధి చిలుమల 2-6, 3-6తో స్నేహదేవి రెడ్డి చేతిలో ఓడింది. అయితే డబుల్స్‌లో సౌజన్య-రష్మీ 6-2, 6-4తో రష్మీ-స్నేహలపై గెలిచారు. ఫైనల్లో తెలంగాణ... గుజరాత్‌ను ఎదుర్కొంటుంది.
 
 విజయ్‌కు ‘డబుల్’
 పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో సర్వీసెస్ షూటర్ విజయ్ కుమార్ రెండు స్వర్ణాలు సాధించాడు. వ్యక్తిగత విభాగంలో విజయ్ 583 పాయింట్లు నెగ్గాడు. సమరేశ్ జంగ్ (576), పెంబా తమాంగ్ (575)లు వరుసగా రజతం, కాంస్యం సాధించారు. టీమ్ ఈవెంట్‌లో విజయ్, తమాంగ్, గురుప్రీత్ సింగ్‌ల బృందం 1733 పాయింట్లతో పసిడిని సొంతం చేసుకుంది. స్విమ్మింగ్‌లో ఆరు మీట్ రికార్డులు బద్దలయ్యాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement