
250 దాటితే పెద్ద స్కోరే: మిథాలీ
మహిళల వన్డేల్లో 250 పైచిలుకు పరుగులు చేస్తే భారీస్కోర్లేనని భారత మహిళా సారథి మిథాలీ రాజ్ తెలిపింది.
న్యూఢిల్లీ: మహిళల వన్డేల్లో 250 పైచిలుకు పరుగులు చేస్తే భారీస్కోర్లేనని భారత మహిళా సారథి మిథాలీ రాజ్ తెలిపింది. ఆతిథ్య ఇంగ్లండ్పై సంచలన విజయంతో భారత్ ఐసీసీ ప్రపంచకప్ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్ రౌత్ బాగా ఆడారు. ప్రపంచకప్ మ్యాచ్ అన్న సంగతి మరచి స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా ఆడారు. సగం ఓవర్లకు పైగా వారే బ్యాటింగ్ కొనసాగించారు. అందువల్లే భారీస్కోరు సాధ్యమైంది.
ఇలాంటి భాగస్వామ్యాలు ఇక ముందు కూడా సాధించాలని ఆశిస్తున్నా. శుభారంభాల్ని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రాణింపుతో భారీస్కోర్లుగా మలచుకోవచ్చు’ అని చెప్పారు. ప్రపంచ రికార్డు అర్ధసెంచరీలపై మాట్లాడుతూ... తనది రికార్డవుతుందన్న సంగతి తెలియదని, పరుగులు చేయడం, అవి జట్టుకు ఉపయోగపడటం ఆనందంగా ఉందని చెప్పింది. మరీ ముఖ్యంగా ప్రపంచకప్లో మేటి జట్టుపై గెలిచి శుభారంభం చేయడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని పేర్కొంది. మహిళా క్రికెట్లో డీఆర్ఎస్ (నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టడం మంచిదేనని తెలిపింది.