భారత్‌ ఓటమి: లక్షలాది గుండెలు పగిలాయి

Team Indias World Cup 2019 Dream Over In Semis - Sakshi

హైదరాబాద్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా ప్రయాణం సెమీస్‌తోనే ముగిసింది. మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమిపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు స్పందించారు. ‘ఈ రోజు లక్షలాది మంది అభిమానుల గుండెలు పగిలాయి. అయితే కోహ్లి సేన పోరాటం మా అందరి మనసులను గెలుచుకుంది. అద్భుత విజయంతో ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు’అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

‘టీమిండియా ఓటమి తీవ్ర నిరాశపరిచింది. అయితే ఆటలో గెలపోటములు సహజం. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా అల్‌రౌండ్‌ షోతో సెమీస్‌ వరకు అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు చాలా గర్వంగా ఉంది. భవిష్యత్‌లో టీమిండియా ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ఇక టీమిండియాకు సానుభూతి తెలుపుతూ అదేవిధంగా న్యూజిలాండ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఐసీసీ, బీసీసీఐతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్‌ చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top