
హైదరాబాద్ : టీమిండియా బ్యాట్స్మన్ రాబిన్ ఊతప్పపై సహచర ఆటగాడు, కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊతప్ప.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ బ్యాట్స్మన్ మిస్బావుల్ హక్ ఇచ్చిన క్యాచ్ను శ్రీశాంత్ పడతాడనుకోలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. శ్రీశాంత్ క్యాచ్లు జారవిడుస్తాడనే పేరు కూడా ఉందని, అందుకే ఆ సమయంలో అతడు క్యాచ్ పట్టాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు. టీమిండియాకు రాసిపెట్టి ఉండటం వల్లే టీ20 ప్రపంచకప్-2007 గెలిచామనే భావన ఇప్పటికీ ఉందని అతడు పేర్కొన్నాడు. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’)
తాజాగా ఊతప్ప వ్యాఖ్యలను ఓ నెటిజన్ శ్రీశాంత్ ముందు తీసుకరాగా అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఊతప్ప తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్ని క్యాచ్లు పట్టాడో నాకైతే తెలియదు. దేశవాళీ క్రికెట్లో గత సీజన్లో అతడు కేరళ తరుపున ఆడాడు. ఆ సమయంలో చాలా క్యాచ్లు నేలపాలు చేశాడనే అపవాదు ఉంది. త్వరలోనే నేను కేరళ తరుపున బరిలోకి దిగుతున్నా. ఈ సందర్భంగా అతడికి ఒకటి చెప్పాలనుకుంటున్నా దయచేసి నా బౌలింగ్లో క్యాచ్లు జారవిడచకు. గత సీజన్లో కేరళ జట్టులో అందరూ నీకన్నా జూనియర్స్ ఉండటంతో నిన్ను ఏం అనలేదు. కానీ నా బౌలింగ్లో క్యాచ్లు నేలపాలు చేస్తే ఏం చేస్తానో ఊతప్పకు బాగా తెలుసు’ అంటూ శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. (భారత క్రికెటర్లతో టచ్లో ఉన్నా: శ్రీశాంత్)