నవనీత్‌–సాహితి జంటకు టైటిల్‌

Navaneeth And Sahiti Pair Got Badminton Title Of Telangana - Sakshi

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండోసీడ్‌ బి. నవనీత్‌–సాహితి (మెదక్‌) జంట సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో  మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఈ జంట చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. ఫైనల్లో నవనీత్‌–సాహితి (మెదక్‌) ద్వయం 17–21, 21–13, 21–14తో టాప్‌సీడ్‌ శ్రీకృష్ణ సాయికుమార్‌ (రంగారెడ్డి)–గురజాడ శ్రీవేద్య (మెదక్‌) జోడీపై అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి గేమ్‌లో వెనుకబడిన ఈ జోడీ తరువాతి రెండు గేముల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను  కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ శ్రీకృష్ణ సాయికుమార్‌ (రంగారెడ్డి)–పి. విష్ణువర్ధన్‌ గౌడ్‌ (హైదరాబాద్‌) జోడీ చాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్లో శ్రీకృష్ణ–విష్ణువర్ధన్‌ జంట 19–21, 21–15, 21–14తో రెండోసీడ్‌ ఆకాశ్‌ చంద్రన్‌–సాయిరోహిత్‌ (హైదరాబాద్‌) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ అభిలాష (హైదరాబాద్‌)–శ్రీవేద్య (మెదక్‌) జోడీ 14–21, 21–18, 21–17తో టాప్‌ సీడ్‌ కె. భార్గవి–వైష్ణవి (రంగారెడ్డి) జంటకు షాకిచి్చంది. సింగిల్స్‌ విభాగంలో ఎం. మేఘనారెడ్డి (హైదరాబాద్‌), ఎం. తరుణ్‌ (ఖమ్మం) చాంపియన్‌లుగా నిలిచారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తరుణ్‌కు వాకోవర్‌ లభించగా... మహిళల ఫైనల్లో ఐదో సీడ్‌ మేఘన 21–11, 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మూడోసీడ్‌ అభిలాష రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top