గురి తప్పింది... కల చెదిరింది

Indian Trap Shooter Kainan Shenay Quits At The Tokyo Olympics - Sakshi

‘టోక్యో’ బెర్త్‌ చేజార్చుకున్న భారత ట్రాప్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌

క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం, ఫైనల్లో ఆఖరి స్థానం

టాప్‌–5లో నిలిచినా బెర్త్‌ దక్కేది

దోహా (ఖతర్‌): దురదృష్టం అంటే ఇదేనేమో! ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో కనీసం ఐదో స్థానంలో నిలిచినా... టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయమయ్యే స్థితిలో భారత ట్రాప్‌ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌ తీవ్ర ఒత్తిడికిలోనై పూర్తిగా గురి తప్పాడు. 25 షాట్‌ల తొలి రౌండ్‌లో ఈ హైదరాబాద్‌ షూటర్‌ కేవలం 13 పాయింట్లే స్కోరు చేసి తొలి రౌండ్‌లోనే ని్రష్కమించాడు. మూడు ఒలింపిక్‌ బెర్త్‌లు ఉన్న ట్రాప్‌ ఈవెంట్‌ ఫైనల్లో కువైట్‌ నుంచి ముగ్గురు... ఖతర్, భారత్, చైనీస్‌ తైపీ నుంచి ఒక్కొక్కరు బరిలోకి దిగారు. ఫైనల్లో కువైట్‌ షూటర్లు అల్‌రïÙద్‌ తలాల్‌ (42 పాయింట్లు), అల్‌ముదాఫ్‌ ఖలీల్‌ (38 పాయింట్లు), నాసిర్‌ మెక్లాద్‌ (29 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు.

ఒక విభాగంలో గరిష్టంగా ఒక దేశం నుంచి ఇద్దరికి మాత్రమే ఒలిం పిక్‌ బెర్త్‌ లభిస్తుంది. గతంలోనే కువైట్‌కు ఈ విభాగంలో ఒక ఒలింపిక్‌ బెర్త్‌ లభించింది. దాంతో ఈసారి వారికి ఒక బెర్తే దక్కింది. మిగతా రెండు బెర్త్‌లు నాలుగో స్థానంలో నిలిచిన యాంగ్‌ కున్‌ పి (చైనీస్‌ తైపీ–26 పాయింట్లు), ఐదో స్థానంలో నిలిచిన మొహమ్మద్‌ అల్‌ రుమాహి (ఖతర్‌–18 పాయింట్లు)లకు లభించాయి. 52 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో తెలంగాణ షూటర్‌ కైనన్‌ షెనాయ్‌ 122 పాయింట్లు స్కోరు చేసి నాసిర్‌ మెక్లాద్‌ (122)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కానీ ఫైనల్‌ కొచ్చేసరికి కైనన్‌ పూర్తిగా నిరాశపరిచాడు.

వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌కే చెందిన ప్రపంచ మాజీ చాంపియన్‌ మానవ్‌జిత్‌ సింగ్‌ సంధూ 118 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టాప్‌–6లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. ఆసియా జోన్‌ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నీ కాబట్టి భారత ట్రాప్‌ షూటర్లకు మరో చాన్స్‌ లేకుండా పోయింది. ఇక టీమ్‌ విభాగంలో కైనన్‌ షెనాయ్, మానవ్‌జిత్, పృథీ్వరాజ్‌లతో కూడిన భారత బృందం 357 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం గెల్చుకుంది.

పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ అనీశ్‌ భన్వాలా 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. ఒకవేళ అనీశ్‌ పదో స్థానంలో నిలిచినా అతనికి కూడా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ లభించేది. అయితే ఈ ఈవెంట్‌ టీమ్‌ విభాగంలో అనీశ్, భావేశ్, ఆదర్శ్‌ సింగ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సాధించింది. ఇదే వేదికపై జరుగుతున్న జూనియర్స్‌ విభాగంలో భారత్‌కు రెండో రోజు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top