భారత మహిళల శుభారంభం 

India Women Cricket Team Won T20 Against England - Sakshi

ఇంగ్లండ్‌పై 5 వికెట్లతో విజయం 

కాన్‌బెర్రా: ముక్కోణపు టి20 టోర్నీలో భారత మహిళల జట్టు విజయంతో బోణీ చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, ట్యామీ బీమాంట్‌ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది.

భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (25 బంతుల్లో 30; 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి గెలిపించింది. ఆఖరి 4 బంతుల్లో విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా భారీ సిక్సర్‌తో హర్మన్‌ మ్యాచ్‌ ముగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top