పాక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌!

Fans Rejoice Pakistan Dominating Win Over South Africa - Sakshi

లండన్‌ : ప్రపచంకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. భారత్‌తో ఓటమిని తట్టుకోలేని అభిమానులు తమ జట్టు ఆటగాళ్లను ఘోరంగా ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై మండిపడ్డారు. అతనిపై సోషల్‌మీడియా వేదికగానే కాకుండా.. కళ్లెదుటనే అభ్యంతరకర పదజాలంతో తిట్టారు. అతని శరీరాకృతిపై కామెంట్లు చేశారు. తమ ఆటగాళ్లకు పిజ్జాలు, బర్గర్లు తినడం తప్పా ఆడటం రాదని కన్నీటి పర్యంతమయ్యారు. దక్షిణాఫ్రికాపై విజయానంతరం ఆ అభిమానులే తమ ఆటగాళ్లను ఆకాశానికెత్తున్నారు. ఎవరినైతే దారుణంగా తిట్టారో వారితోనే సెల్ఫీలు దిగుతున్నారు. తమ జట్టు విజయం పట్ల అభినందనలు తెలుపుతున్నారు. గెలిచిన ఆనందంలో తమ భావోద్వేగాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

కొందరైతే తమ ఆటగాళ్లు, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ను దూషించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హరిస్‌ సొహైల్‌ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), బాబర్‌ ఆజమ్‌ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు) రాణించారు.  తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. డుప్లెసిస్‌ (79 బంతుల్లో 63; 5 ఫోర్లు), డికాక్‌ (60 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.  6 మ్యాచ్‌లు ఆడిన పాక్‌ రెండు గెలిచి.. ఒకటి రద్దవ్వడంతో 5 పాయింట్లతో 7 స్థానంలో నిలిచింది. సెమీస్‌ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలంటే.. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌, అప్గానిస్తాన్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిందే. పాక్‌ తమ తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఈ నెల 26 (బుధవారం)న ఆడనుంది.  
చదవండి : 
వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’
సారీ సర్ఫరాజ్‌!
నీకో దండం..నువ్వు కొట్టకురా నాయనా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top