విష్ణు–సాయిలకు డబుల్స్ టైటిల్
జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
లక్నో: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో తెలంగాణ జోడి పి.విష్ణువర్ధన్ గౌడ్– పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ సత్తా చాటింది. విష్ణు–సాయి జంట అండర్–19 బాలుర డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ సాయి కుమార్–విష్ణువర్ధన్ జోడి 21–11, 21–19తో రెండో సీడ్ మన్జీత్ సింగ్– డింకూ సింగ్ జంటపై గెలిచింది.
అంతకుముందు సెమీస్లో 21–7, 22–20తో ఆలాప్ మిశ్రా–ధ్రువ్ రావత్పై, క్వార్టర్స్లో 21–17, 21–16తో అమన్– యశ్పై నెగ్గి తెలంగాణ ఆటగాళ్లు ఫైనల్కు చేరారు.