భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : మనసులు గెలుచుకున్న జంట | Couple with Indo Vs Pak Jersey Bowls Internet Over | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : మనసులు గెలుచుకున్న జంట

Jun 17 2019 2:38 PM | Updated on Jun 17 2019 3:14 PM

Couple with Indo Vs Pak Jersey Bowls Internet Over - Sakshi

భార్యది భారత్‌.. భర్తది పాక్.. ఇద్దరు కలిసి భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఏంచేశారంటే..

మాంచెస్టర్‌ : ప్రపంచమంతా ఉత్కంఠతను రేపిన భారత్‌-పాక్‌ పోరులో కోహ్లిసేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు దాయాదీ దేశాల అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ అభిమాన జట్లకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కోహ్లిసేన విజయాన్ని భారత అభిమానులు ఆస్వాదించంగా.. ఓటమిని పాక్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ కెనడాకు చెందిన ఓ జంట ఇరు దేశాల అభిమానుల మనసులను గెలుచుకుంది. క్రికెట్‌ స్పూర్తి ఇంకా బతికే ఉందని నిరూపించింది. వారు చేసిన పనికి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సలాం కొడుతోంది. ఆదివారం ఉత్కంఠగా మ్యాచ్‌ సాగుతోంది. ఇరు దేశాల అభిమానులు ఆయా దేశాల జెర్సీలు ధరించుకోని స్టాండ్స్‌లో సందడి చేస్తున్నారు. కానీ వీరి మధ్యలో ఓ జంట ఇరుదేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్‌ వేసుకోని రెండు జట్లకు మద్దతు పలుకుతోంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటేనే యుద్దంలా భావించే అభిమానుల మధ్యలో వారిని చూసిన ఓ ట్విటర్‌ యూజర్‌ వారి ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేశారు.

‘భారత్‌-పాక్‌ జెర్సీలు కలిపి వేసుకున్న ఈ జోడి భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో కనిపించింది. భర్తది పాకిస్తాన్‌. భార్యది భారత్‌. కెనడాలో నివసిస్తున్న ఈ ఇద్దరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఇలా ఇరుదేశాల జెర్సీలు ధరించి ఇంగ్లండ్‌లో ఆస్వాదించారు. క్రికెట్‌ స్పూర్తిని తెలియజేస్తూ శాంతికి చిహ్నంగా నిలిచారు.’ అని ఇంగ్లండ్‌కు చెందిన లక్ష్మీ కౌల్‌ అనే ట్వీటర్‌ యూజర్‌ పేర్కొన్నారు. ఇక ఈ జోడి చేసిన పనిపై ఇరుదేశాల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య జరుగుతున్న కేవలం ఆటనేనని మనందరికి గట్టిగా చెప్పారని ఒకరు కామెంట్‌ చేయగా.. ఇద్దరి మధ్య ఎంత ప్రేమనో అని మరొకరు అభిప్రాయపడ్డారు. ‘నిన్న ఎవరు గెలిచారనేది అనవరసరం. కానీ వీరు చేసిన పని మనమంతా ఒక్కటేననే ఫీలింగ్‌ కలిగిస్తోంది.’ అని మరోకరు కామెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement