బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్లోనూ యువరాజ్ సింగ్ చెలరేగాడు. అయితే తన జట్టు ఎయిరిండియాను ఓటమినుంచి తప్పించలేకపోయాడు.
ఎయిరిండియా పరాజయం
బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ
ముంబై: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్లోనూ యువరాజ్ సింగ్ చెలరేగాడు. అయితే తన జట్టు ఎయిరిండియాను ఓటమినుంచి తప్పించలేకపోయాడు. సోమవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఇండియా సిమెంట్స్ 7 వికెట్ల తేడాతో ఎయిరిండియాను చిత్తు చేసింది. యువరాజ్ (76 బంతుల్లో 79; 8 ఫోర్లు, 3 సిక్స్లు)తో పాటు సచిన్ రాణా (28 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎయిరిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాహిల్ షా (4/68) ఆకట్టుకున్నాడు. అనంతరం ఇండియా సిమెంట్స్ 45.1 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (139 బంతుల్లో 133; 6 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో జట్టును గెలిపించాడు.
ఎస్బీహెచ్ను గెలిపించి సుమన్
బరోడా: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు తొలి విజయం దక్కింది. సోమవారం ఇక్కడ హోరాహోరీగా సాగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఎస్బీహెచ్ 4 పరుగుల తేడాతో బీఎస్ఎన్ఎల్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్బీహెచ్... తిరుమలశెట్టి సుమన్ (114 బంతుల్లో 91), డానియెల్ మనోహర్ (80 బంతుల్లో 60) అర్ధ సెంచరీలు సాధించడంతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. అనంతరం బీఎస్ఎన్ఎల్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. గణేశ్ సతీశ్ (71 బంతుల్లో 58), నిరంజన్ బెహరా (66 బంతుల్లో 54) రాణించారు. ఎస్బీహెచ్ బౌలర్లలో రవికిరణ్, అబ్సలమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
ఆంధ్రా బ్యాంక్ పరాజయం
అహ్మదాబాద్: గ్రూప్ ‘ఎ’లో ఆంధ్రా బ్యాంక్కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఇన్కంటాక్స్ 5 వికెట్ల తేడాతో ఆంధ్రా బ్యాంక్ను ఓడించింది.