కోహ్లిపై అఫ్రిది ప్రశంసలు
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ విజయంలో కోహ్లి ముఖ్య భూమిక పోషించడాన్ని ప్రస్తావిస్తూ అఫ్రిది కొనియాడాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి అత్యధిక హాఫ్ సెంచరీలు విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేయగా, అందుకు అఫ్రిది రీట్వీట్ చేస్తూ కోహ్లిని ప్రశంసించాడు. ‘ కోహ్లి నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు’ అని అఫ్రిది పేర్కొన్నాడు.
సఫారీలతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో కోహ్లి అజేయంగా హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ(21 హాఫ్ సెంచరీలు)ను కోహ్లి అధిగమించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్లో కోహ్లి తనదైన మార్కుతో చెలరేగిపోయాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 72 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటును కోహ్లి నమోదు చేయడం ఇక్కడ మరో విశేషం. భారత్-దక్షిణాఫ్రికాల తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. కాగా, రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందడంతో సిరీస్లో 1-0తో సాధించింది.