‘సీఎం రమేష్ ఒక్కరోజైనా నోరు తెరిచారా?’
సాక్షి, కడప : కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్రెడ్డి కడపలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏపీ స్టీల్స్ పేరిట పరిశ్రమ స్థాపిస్తామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు కడపలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ సర్కార్ నాలుగేళ్లుగా ఏం చేసింది? టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పార్లమెంట్లో ఏ ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ గురించి అడిగారా అని ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో మాతో కలిసి రావాలని కోరితే టీడీపీ ఎంపీలు ఎందుకు ముందుకు రాలేదంటే.. వారికి విభజన హామీలపై చిత్తశుద్ధి లేదంటూ ఆయన ధ్వజమెత్తారు.