మా నాన్నకు ఫోన్‌.. నాకు షాక్‌ | Yeddyurappa Son Reveal Why He Cancelled His Nomination | Sakshi
Sakshi News home page

అందుకే నామినేషన్‌ వేయలేదు

May 7 2018 2:37 PM | Updated on Oct 17 2018 6:27 PM

Yeddyurappa Son Reveal Why He Cancelled His Nomination - Sakshi

బీవై విజయేంద్ర, యడ్యూరప్ప (జతచేసిన చిత్రం)

సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది స్వయానా ముఖ్యమంత్రి అభ్యర్ధి కొడుకు చివరి నిమిషంలో నామినేషన్‌ను వేయకుండా వెనుదిరగడం. కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నామినేషన్‌ దాఖలు చేయడం కోసం అని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. కానీ చివరకు నామినేషన్‌ వేయలేదు. ఈ విషయం గురించి ఎన్నో అనుమానాలు, పుకార్లు వినిపించనప్పటికి విజయేంద్ర మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. కానీ ఈమధ్యే ఓ ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని వెనుక గల కారణాలను బయటపెట్టారు.

ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘ఆ రోజు(ఏప్రిల్‌ 23) ఉదయం 11 గంటల ప్రాంతంలో మా నాన్నకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ కాల్‌ మాట్లడిన తరువాత మా నాన్న నన్ను నామినేషన్‌ వేయవద్దని చెప్పారు. నాన్న మాట ప్రకారం నేను నా నామినేషన్‌ను రద్దు చేసుకున్నాను. తర్వాత యధావిధిగా మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చాను. ఈ విషయం గురించి నేను మా నాన్నను ఏమి అడగలేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం మేరకు మా నాన్న ఆ నిర్ణయం తీసుకుని ఉంటారనుకుంటున్నాను. అయితే ఈ విషయం గురించి నాకు కచ్చితంగా తెలియదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ నేను ‘ఫోన్‌ చేసింది ఎవర’ని మా నాన్నని అడగలేదు అని తెలిపారు. ఈ విషయం వల్ల తనకు దిగ్భ్రాంతి కంటే అధికంగా బాధ కలిగిందని తెలిపారు. దీనంతటికి కారణం తమ పార్టీలో చేరిన కాంగ్రెస్‌​ పార్టీ కార్యకర్తలే అన్నారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ది కొడుకునే నామినేషన్‌ వేయకుండా ఆపితే పరిణామాలు ఎలా ఉంటాయో బీజేపీ అధిష్టానానికి తెలుసు. అయినా కూడా అంతటి సాహసం చేయడానికి ఒక బలమైన కారణమే ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోదీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఉద్ధేశించి ‘కుటుంబ పాలన’, ‘రాజరిక’మని విమర్శించారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్ది కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తే అప్పుడు తమను విమర్శించడానికి ప్రతిపక్షానికి అవకాశం కల్పించినట్టు అవుతుందని భావించి విజయేందర్‌ను నామినేషన్‌ వేయకుండా ఆపారని తెలిపారు. విజయేందర్‌ మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకే అక్కడ కొన్ని వారాల పాటు ప్రచారం కూడా నిర్వహించారు.

విజయేందర్‌కు పోటీగా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి సిద్దరామయ్య కుమారుడు కూడా ఇదే నిజయోకవర్గం నుంచి పోటీకి దిగారు. విజయేంద్ర నామినేషన్‌ వేయకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆ రోజు రాత్రంతా నిరసన తెలుపుతూ కుర్చీలు విరగొట్టి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement