
వైఎస్సార్సీపీలో చేరిన తేతలి రామారెడ్డి
అనపర్తి మాజీ ఎమ్మెల్యే సహా పలువురు నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి సహా పలువురు నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు జననేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేతలి రామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రామారెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్.. బిక్కవోలు మీదుగా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ వరకు నేటి పాదయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం గొల్లల మామిడాడలో సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.