మోదీపై బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

TDP MLA Balakrishna Controversial Comments On PM Modi - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో మాట్లాడిన ఆయన.. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామని అన్నారు. వేదికపైనున్న చంద్రబాబు ముసిముసిగా నవ్వుతూ బావమరిది వ్యాఖ్యలను స్వాగతించారు.

నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం..: ‘‘సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బీజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు’’ అని బాలకృష్ణ అన్నారు.

మట్టీ, నీళ్లు మాకు లేవా?: అశాస్త్రీయంగా జరిగిన విభజనతో దిక్కులేకుండా పోయిన ఏపీని చంద్రబాబు ఒక్కరే ఉద్ధరిస్తాని జనం టీడీపీని గెలిపించారని బాలకృష్ణ చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు మోదీ మట్టి, పవిత్ర జలాలను తేవడాన్ని గుర్తుచేస్తూ.. ‘ఏం మా దగ్గరలేవా మట్టి, నీళ్లూ?’ అని ప్రశ్నించారు. ఏపీ పౌరుడు ఒక్కొక్కరు ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి బీజేపీపై, మోదీపై పోరాటం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. సదరు వ్యాఖ్యలను ‘స్ఫూర్తిదాయక ప్రసంగం’  వ్యాఖ్యత అభివర్ణించడం కొసమెరుపు. కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ స్పందించాల్సిఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top