
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ కమిటీ భేటీలకు ఒక్కసారి కూడా హాజరుకాని రాహుల్ సాయుధ దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. బాధ్యతాయుత విపక్ష నేత చేయకూడని పనులన్నీ రాహుల్ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశాలు ఆయనకు అవసరం లేదని, కమీషన్లు చాలని నడ్డా ఎద్దేవా చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాలను అవగతం చేసుకునే నేతలు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఉన్నా వారసత్వ నాయకత్వం వారిని ఎదగనీయదని ఆక్షేపించారు. కాగా మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ విమర్శలతో విరుచుకుపడిన నేపథ్యంలో జేపీ నడ్డా కాంగ్రెస్ నేతపై ఘాటైన ట్వీట్లతో విమర్శలకు దిగారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో ఘోరంగా విఫలమైన మోదీ సర్కార్ కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కోవడంలోనూ విఫలమైందని రాహుల్ ఆరోపించారు. మోదీ సర్కార్ వైఫల్యాలపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అథ్యయనం చేపడుతుందని చురకలు వేశారు. చదవండి : రాజీవ్ ఫౌండేషన్కి ‘ప్రధాని’ నిధులు