ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ అడ్మిషన్ల మాదిరిగా ఇంటర్మీడియెట్ అడ్మిషన్లను ఆన్లైన్లో ప్రభుత్వమే చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సూచించారు. శనివారం బీసీ భవన్లో బీసీ విద్యార్థి సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన బీసీ విద్యార్థి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను దోచుకున్నాయని, రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని కృష్ణానది అవతలికి తరిమికొడతానన్న కేసీఆర్ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల్లో బట్టీ్ట చదువుల వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, మల్లేశ్ యాదవ్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.