మున్సిపాలిటీల్లో ఎగిరేది గులాబీ జెండానే.. | Harish Rao Slams Congress Party In Sangareddy Election Campaign | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో ఎగిరేది గులాబీ జెండానే..

Jan 18 2020 11:27 AM | Updated on Jan 19 2020 2:14 AM

Harish Rao Slams Congress Party In Sangareddy Election Campaign - Sakshi

సాక్షి, సంగారెడ్డి : అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్‌ మున్సిపాలిటీల్లోని వార్డుల్లో అభ్యర్థులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని సర్వేలన్నీ తేటతెల్లం చేస్తున్నా యని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, మాయమాటలు చెప్పి ఎన్నికల సమయంలో వచ్చేవారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  తమకు ఎవరితోనూ పొత్తులు లేవని, టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న వారి కారు గుర్తుకే ఓటేయాలని హరీశ్‌ సూచించారు. కొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తాము గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరుతామని అం టున్నట్లు తెలుస్తోందని, కారు గుర్తుపై గెలిచిన వారే తమ వారని స్పష్టం చేశారు.

ఇటు 57 ఏళ్లు దాటిన వారందరికీ పెన్ష న్లుఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాల వల్ల 8 మంది అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు. ఆయన నిర్వాకం వల్లనే వారిలో నలుగురు అధికారులు చనిపోయారన్నారు. సంగారెడ్డిని ఏం అభివృద్ధి చేశాడని మళ్లీ ఓట్లు అడుగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే సంగారెడ్డిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. సీఏఏకు టీఆర్‌ఎస్‌ వ్యతిరేకమని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement