ఇప్పుడలా లేదు: హరీశ్‌ | Harish Rao Slams BJP, TDP | Sakshi
Sakshi News home page

ఇప్పుడలా లేదు: హరీశ్‌

Nov 14 2017 6:58 PM | Updated on Aug 11 2018 6:44 PM

Harish Rao Slams BJP, TDP - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గొప్పగా నడుస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో ఎండిన పంట, లాంతర్లతో అసెంబ్లీకి వచ్చేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. గతంలో ఏదో ఒక అంశంపై సమావేశాలు వాయిదా పడేవని, ఇప్పుడు ఏ అంశం పైనైనా చర్చకు తాము సిద్ధమనడంతో వాయిదా ప్రసక్తే ఉండటం లేదన్నారు. గతంలో బిల్లులపై చర్చలు జరిగేవి కావని, గిలెటిన్‌ అయ్యేవని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ రోజు అంశం ఆరోజే పూర్తవుతోందని, వాయిదా తీర్మానాలపై చర్చ సాధ్యం కాదని పేర్కొన్నారు.

మోదీ మాట తప్పారు
అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..  తెలంగాణలో లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు చెప్పారు. కోటి ఉద్యోగాలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని, తాము అలా కాదని హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ వాకౌట్‌ చేయడం దారుణమన్నారు. నిరుద్యోగుల గురించి ఈ రెండు పార్టీలు ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతలు ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement