‘ముందస్తు ఎన్నికలంటే బెంబేలు’

GVL Narasimha Rao Slams Chandrababu In Vijayawada - Sakshi

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటమి భయంతో టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చంద్రబాబుకు ఈసారి అధికారం మూడు నాళ్ల ముచ్చటే అని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతిలో కనీసం శాశ్వత భవనం కట్టలేకపోయారని, సెక్రటేరియట్‌ నిర్మించలేని చంద్రబాబు ఒలంపిక్స్‌ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది..మంత్రులు, ఎమ్మెల్యేలను చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారని అన్నారు.

అవినీతికి చట్టబద్ధత తెచ్చిన ఘనుడు చంద్రబాబేనని వెల్లడించారు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని వాళ్లలో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యడమే అవుతోందన్నారు. సీఎం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే స్పీకర్‌ చూస్తూ ఉన్నారని, కచ్చితంగా ఈ సమావేశాల్లో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనన్నారు. ఏపీ ఫిషరీష్‌ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు..వాటి వివరాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు అప్పు చెయ్యటంలో నెంబర్‌ వన్‌ అని నిరూపించుకున్నారని..అప్పుల్లో కూడా అవినీతి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. హెరిటేజ్‌ భూములు మాత్రం అమరావతి నిర్మాణంలో పోకుండా చేశారనే అపవాదు ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫండ్‌ కోసం అమరావతిని బాబు వాడుకుంటున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడిన వారి పేర్లు త్వరలోనే బయటపెడతామని చెప్పారు. ప్రజల మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు దళారీలుగా ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు 10 శాతం వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని అన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌ రాజకీయ బాధితుడిగా మారాడని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top