ప్రశ్నించే వారుండొద్దా...?

Congress Slams TRS Party In Khammam - Sakshi

కేఎంసీ సమావేశంలో సమస్యను తప్పుదోవ పట్టించే ప్రయత్నం  

విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌

సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరిగిన పాలకవర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారుండదనే రీతిలో సమావేశాన్ని నిర్వహించారని, సమావేశంలో ప్రశ్నించే వారు ఉండొద్దా? ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌ ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్‌ కార్యాలయంలో కేఎంసీ కార్పొరేటర్లు యర్రం బాలగంగాధర్‌ తిలక్, నాగండ్ల దీపక్‌ చౌదరి, వడ్డెబోయిన నర్సింహారావుతో కలిసి మాట్లాడుతూ ఆరు నెలలకు ఒకసారి జరిగే సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రస్తావించి వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందని, అలాంటి సమావేశంలో ఏకపక్షంగా స్థానికంగా ఎమ్మెల్యే మాట్లాడారన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ముగ్గురు ఉన్నారు. అధికార పక్షం మీరు 43మంది ఉన్నారు. సమాధానం చెప్పలేరా.. అని వారిని పరోక్షంగా వివాదాలకు ప్రోత్సహించారన్నారు. ప్రశ్నించే వారు ఉండవద్దనే రీతిలో సమావేశాన్ని నిర్వహించారన్నారు. నగరంలో ఇప్పటికే నీటి సమస్య, సెంట్రల్‌ లైటింగ్, సర్కిల్స్‌ తదితర సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే తండ్రి కూడా గతం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన ఒక్కరే ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు తక్కువ చేసి చూడలేదని, ప్రజాప్రతినిధిగా గౌరవించారని గుర్తుచేశారు. ఇటీవల గాంధీచౌక్‌లో జరిగిన గాంధీ విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమంలో సైతం స్థానిక కార్పొరేటర్‌ తిలక్‌ను గృహ నిర్బంధం  చేశారన్నారు.

పేదలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కార్పొరేటర్లు యర్రం బాలగంగాధర్‌ తిలక్, నాగండ్ల దీపక్‌చౌదరి, వడ్డెబోయిన నర్సింహారావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగతంగా దూషణలు చేశారని, ఇది సరైన విధానం కాదన్నారు. పాలకవర్గ పదవీ కాలం మూడున్న రేళ్లు అవుతుందని, రూ.కోట్లలో నిధులు కేటాయించినట్లు ప్రచా రం చేస్తున్నారని, కొన్ని డివిజన్లలో ఇప్పటికీ కనీసం రూ.8 నుంచి 10లక్షల అభివృద్ధి పనులు కూడా పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. తాము సారధీనగర్‌ వంతెన సమస్య, తాగు నీటి తదితర సమస్యలపై చర్చ జరగాలనే విషయాలను తాము మేయర్‌కు విన్నవించాలనే ఉద్దేశ్యంతో ఉన్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లను రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. భూ కబ్జాలు చేశారని ఆరోపించారని, అసలు భూకబ్జాలు ఎవరు ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. విలేకరుల సమావేశంలో నాయకులు బండి మణి, మిక్కిలినేని నరేందర్, తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top