అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి : బొత్స | Sakshi
Sakshi News home page

అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి : బొత్స

Published Tue, May 15 2018 12:43 PM

chandrababu cheating ap people says bothsa - Sakshi

జామి: అవినీతిమయంగా మారిన చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా జామిలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిందన్నారు.

మట్టి దగ్గర నుంచి ఇసుక వరకు సీఎం తనయుడు లోకేష్, పార్టీ నేతలు దోచుకున్నారన్నారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలను, నిరుద్యోగభృతి కల్పిస్తామని యువకులను ఇలా.. అన్ని రంగాలవారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. పేదలకు ఇల్లు మంజూరు చేయని ఘనత టీడీపీదేనని విమర్శించారు.

త్వరలో మంచిరోజులు వస్తాయని, మాట, మడమ తిప్పని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారన్నారు. జగన్‌ సీఎం అయిన తర్వాత ప్రతి రైతుకు ఏటా సాగుఖర్చులకు రూ.12,500 ఇస్తారన్నారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డిదేనన్నారు.

శృంగవరపుకోట వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త అల్లు జోగినాయుడు మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను), వైఎస్సార్‌ సీపీ శృంగవరపుకోట నియోజకవర్గం సమన్వయకర్త అల్లు జోగినాయుడు, పార్టీ రాష్ట్రకార్యదర్శి రొంగలి జగన్నాథం, రాష్ట్ర కారదర్శి నెక్కలనాయుడుబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement