ఆవేదనతో మాట్లాడుతున్నా.. భయమేస్తోంది | Bhatti Vikramarka Fires On TRS Government | Sakshi
Sakshi News home page

ఆవేదనతో మాట్లాడుతున్నా.. భయమేస్తోంది

Jun 16 2019 1:39 PM | Updated on Jun 16 2019 4:45 PM

Bhatti Vikramarka Fires On TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక తెలంగాణ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని! కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు దోపిడీకి గురి అవుతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒక ఎకరానికి ఒక్క చుక్క నీరు కూడా అందలేదని అన్నారు. నియామకాల భర్తీ విషయంపై చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ ఆవేదనతో మాట్లాడుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం చూస్తుంటే భయమేస్తోంద’’ని అన్నారు. ఆదివారం సీఎల్పీ హాల్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రాజెక్టును ప్రారంభించడం అంటే నీళ్లు వదిలితే పంట పొలాలకు ఏ ఆటంకం లేకుండా నీళ్లు వెళ్లాలి. 21వ తేదీ మీరు ప్రాజెక్టు ప్రారంభిస్తే ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు వెళతాయి?. మేడిగడ్డ నుంచి గంధమల్ల వరకు ఎన్ని కాలువలు పూర్తి అయ్యాయి?. ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తారు?. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

21వ తేదీ కేసీఆర్ ప్రారంభించే ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి అన్నారం వరకు మాత్రమే నీళ్లు సరఫరా అవుతాయి. రూ. 50 వేల కోట్లు ఖర్చు పెట్టి కనీసం 15 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. కాంగ్రెస్‌ హయాంలో 80 శాతం పూర్తి చేసిన దుమ్ముగూడెం ఇందిరా సాగర్, 75 శాతం పూర్తి చేసిన రాజీవ్ సాగర్‌ను ఆపారు. టీఆర్‌ఎస్‌ వాళ్లే మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకున్నారు. మేము ప్రాజెక్టులను అడ్డుకుంటే దేవాదుల, మిడ్ మానేరు ప్రాజెక్టులు వచ్చేవి కావు. ప్రాజెక్టులపై చర్చకు మేము రెడీ. ప్రాజెక్టు అంచనాలు పెంచి డబ్బులు దండుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నా.  రూ. 28,000 వేల కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని లక్షల కోట్లకు  పెంచారు. టెండర్‌ల  ప్రక్రియ జ్యుడీషియల్‌కు ఇవ్వాలని కోరుతున్నా’’నన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement