హోదాతోనే నవోదయం.! | Benefits If AP Get Special Category Status | Sakshi
Sakshi News home page

హోదాతోనే నవోదయం.!

Mar 27 2019 11:35 AM | Updated on Mar 28 2019 5:27 PM

Benefits If AP Get Special Category Status - Sakshi

రైల్‌రోకో కార్యక్రమంలో నాయకులు(ఫైల్‌)

అడ్డగోలు విభజనతో చితికిపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సంజీవనే అంటున్నారు జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకహోదా లభిస్తే రాష్ట్రానికి అనేక రాయితీలతో పాటు పన్నుల్లో మినహాయింపు లభిస్తుందంటున్నారు. పెద్దసంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. జిల్లాతో పాటు రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుందని విశ్వసిస్తున్నారు.. ప్రత్యేకహోదా అంశం నేటికీ సజీవంగా ఉందంటే అది ఒక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వల్లేనని.. హోదా కోసం జాతీయస్థాయిలో పోరాటం చేసిన హోదా యోధుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడేనని.. హోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా విడిచి రాజీనామాలు చేసిన హోదా వీరులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అని జనం ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. 

సాక్షి, వైవీయూ : తల్లిని చంపి బిడ్డను బతికించిన తీరున ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించారు. 5 కోట్ల ఆంధ్రప్రజల విన్నపాలను పట్టించుకోకుండా పార్లమెంట్‌ తలుపులు మూసి మరీ రాష్ట్ర విభజన చేశారు. హైదరాబాద్‌ కాదు.. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తాం.. అన్న వారు ఆనక మాట తప్పారు. ఇస్తామన్న ప్రత్యేకహోదాకు మంగళం పాడారు. హోదా పదేళ్లు కాదు.. పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు కేసులకు భయపడి కేంద్రానికి వంతపాడారు. హోదాతో ఏమొస్తుంది..? హోదా ఏమైనా సంజీవనా..? అంటూ ప్యాకేజీనే ముద్దంటూ కేంద్ర ఆర్థికమంత్రికి లేఖసైతం రాశారు. అయితే తొలినుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకహోదాపై ఒకేమాట.. ఒకే బాటగా వ్యవహరిస్తూ వచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలో సజీవంగా ఉండేలా ఎన్నో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు చేశారు.

యువభేరి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతలో చైతన్యం రగిలించారు. హోదా ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలియజెప్పారు. ప్రత్యేకహోదా అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు దేశరాజధాని ఢిల్లీలో సైతం ధర్నా చేపట్టారు. చివరి అస్త్రంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారు. జాతీయస్థాయిలో ప్రత్యేకహోదా అంశాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, హోదా ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని,యువతకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలను ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

ప్రత్యేకహోదా వస్తే జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలు..

  • ప్రత్యేకహోదా వస్తే ఖనిజాల ఖిల్లా అయిన వైఎస్‌ఆర్‌ జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉక్కుపరిశ్రమతో పాటు, దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ మినహాయింపుతో పాటు పలు రాయితీలు కల్పించడం ద్వారా లభించే అవకాశం ఉండటంతో కడప నగర సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు పరుగులు తీస్తాయి.
  • గ్రామీణ ప్రాంతాల్లోనూ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. స్థానికులకు వారి సమీప గ్రామాల్లోనే ఉద్యోగాలు లభిస్తాయి.
  • హార్టికల్చర్‌ హబ్‌గా రూపొందించే అవకాశం ఉండటంతో పాటు ఉద్యాన ఉప పరిశ్రమలు, అరటి, మామిడి పల్ఫ్, జ్యూస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి.
  • రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని మంగంపేటలోని బెరైటీస్, పుల్లరిన్‌ తదితర ఖనిజ సంపదకు స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ముగ్గురాళ్ల ఉప పరిశ్రమలు ఏర్పాటవుతాయి. సిరామిక్, టైల్స్‌ తదితర పరిశ్రమలు ఏర్పాటవుతాయి.
  • దీంతో పాటు ఎర్రచందనం అధికంగా లభిస్తుండటంతో రెడ్‌శాండల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు అవకాశాలున్నాయి.
  • అదే విధంగా మూతబడిన ఆల్విన్‌ ఫ్యాక్టరీ లాంటివి తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటాయి. 

Advertisement
 
Advertisement
Advertisement