మహాకూటమి కాదు.. పెద్ద దొంగల కూటమి

AP BJP Chief Kanna Laxminarayana Fires on Mahakutami - Sakshi

అవినీతిపరులంతా కలిసిపోయారు

చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడాలి

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

సాక్షి, విజయనగరం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులంతా కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మహాకూటమి కాదు అది పెద్ద దొంగల కూటమి అని అభివర్ణించారు. పార్వతీపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నరేంద్ర మోదీ పాలననే స్వాగతిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్, చంద్రబాబుల అవినీతి బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

వారి అవినీతిని నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధమని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని.. నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 2014 ఎన్నికల్లో  సోనియాగాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి.. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top