‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు మద్దతు తెలపడం హాస్యాస్పదం’

Published Sat, Jul 4 2020 6:39 PM

Amanchi Krishna Mohan Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, చీరాల: కరోనా కష్టకాలంలో ప్రాణ భయంతో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు నాయుడు, రాజధాని పేరుతో తన సామాజిక వర్గం చేస్తున్న 200 రోజుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు తెలపడం హాస్యాస్పదం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో భూములు కాపాడుకునేందుకు  చంద్రబాబు విదేశాల్లో ఉన్న తన సామాజిక వర్గంతో అమరావతిలో దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 300 కోట్ల రూపాయలతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేశారని విమర్శించారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, రాజధాని వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం అని ఆమంచి పేర్కొన్నారు.

చంద్రబాబుకు మతి భ్రమిస్తోంది: కిలివేటి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను చూసి చంద్రబాబు మతి భ్రమిస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. శనివారం ఆయన నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపెట్టి భ్రమరావతి చేసిన చంద్రబాబుకు సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 108, 104ల వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఒకేసారి 1088 అంబులెన్స్‌ వాహనాలను సీఎం జగన్‌ ప్రవేశపెడితే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. 

 రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు తాపత్రాయం : దాడిశెట్టి
చంద్రబాబు నాయుడు అమరావతి లో ఉన్న తన భూముల కోసం తాప్రతాయ పడుతున్నడు తప్పా, ప్రజల అభివృద్ధి కోసం తాపత్రయం పడడం లేదని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాష్ట్ర బాగోగుల కంటే అమరావతిలో ఉన్న 30 గ్రామాల రియల్‌ ఎస్టేట్‌ బాగోగులే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్‌ ప్రకటిస్తే దానికి మోకాలడ్డుతూ చంద్రబాబు కోర్టుఓల కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. 

Advertisement
Advertisement