
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీలు చేశారు. గోరఖ్పూర్ జిల్లా మేజిస్ట్రేట్కు మాత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమోషన్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలయిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొత్తం 37మంది ఐఏఎస్ అధికారులను, 16 మంది జిల్లా మేజిస్ట్రేట్లను బదిలీ చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
అయితే, గోరఖ్పూర్లో మేజిస్ట్రేట్గా పనిచేస్తున్న రాజీవ్ రౌతెలాకు మాత్రం ప్రమోషన్ ఇచ్చి దేవిపఠాన్కు డివిజనల్ కమిషనర్గా చేశారు. ఈయన లోక్సభ ఉప ఎన్నికల వివరాలు బయటకు రానివ్వకుండా చేసేందుకు మీడియాపై కౌంటింగ్ సెంటర్ల వద్ద నిషేధం ప్రకటించి వివాదాస్పదమయ్యారు. దీంతో ఆయనకు ప్రమోషన్ ఇవ్వడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.