పేదరికం పెరుగుతోంది | poverty increasing more and more | Sakshi
Sakshi News home page

పేదరికం పెరుగుతోంది

Jul 5 2015 12:44 AM | Updated on Sep 3 2017 4:53 AM

పేదరికం పెరుగుతోంది

పేదరికం పెరుగుతోంది

ఈ దేశంలో రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ దేశంలో రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా సంపద పెంచుకుంటే ఆర్థికాభివృద్ధి ఫలాలు జాలువారి (ట్రికిలింగ్ ఎఫెక్ట్ థియరీ) కింద ఉన్న పేదలకు అందుతాయనీ, అది ఒక్కటే పేదరికం నిర్మూలనకు మార్గమనే వాదన ప్రస్తుత పాలక వర్గా నిది. ఆర్థికాభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలనే వాదన యూపీఏ సర్కార్‌ది.
 
 ఒకరు తానే ఫలానా నగరాన్ని అభివృద్ధి చేశానంటూ గొంతు చించుకుంటారు. మరొకరు తానే తన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో వేగంగా నడిపించి అద్భుతాలు సృష్టించాననీ, అదే పని దేశవ్యాపితంగా చేస్తాననీ చెప్పుకుంటారు. పేదరికం నిర్మూలన కోసమే తమ పార్టీ పాటుపడిందని ఇంకొకరు చాటుకుంటారు. దాదాపు ఏడు దశాబ్దాల స్వపరిపాలన, అనేక పంచవర్ష ప్రణాళికలూ, వివిధ సంక్షేమ పథకాల తర్వాత మనం ఎక్కడున్నాం? చైనా కంటే వేగంగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) పెరుగుతోందనీ, మరి కొన్ని సంవత్సరాలలో అమె రికా, చైనా తర్వాత మనమే ప్రబలమైన ఆర్థికశక్తిగా ఎదగబోతున్నామనీ సగర్వంగా చాటుకుంటున్న మనం ఆత్మవంచన చేసుకుంటున్నామా?  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం విడుదల చేసిన సామాజికార్థిక, కుల (సోషియోఎకానమిక్, కాస్ట్)సర్వే (సెక్) ఫలితాలు మనకు రుచించని, అంగీక రించడానికి సిద్ధంగా లేని నిప్పులాంటి  నిజాన్ని నిగ్గు తేల్చాయి.
 
 గ్రామీణ భారతంలో సగానికి పైగా కుటుంబాలు (51శాతం) కూలిచేసుకొని పొట్ట నింపుకోవలసిన దుస్థితిలో ఉన్నాయని సెక్ నిర్ధారించింది. మూడింట ఒక కుటుంబానికి భూమి లేదు. 23.5 శాతం గ్రామీణ కుటుంబాలలో చదువుకున్న వయోజనులు లేరు. ఇట్లా దిగ్భ్రాంతి, మనస్తాపం కలిగించే అనేక వాస్తవాలను ఈ సర్వే వెల్లడించింది. కులాల వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) విశ్లేషిస్తున్నారు. వాటిని పార్లమెంటుకు సమర్పిస్తారని ప్రభుత్వం చెబుతుంటే బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వెనుకబడిన కులాల సంఖ్యావివరాలను తొక్కిపెట్టారంటూ యదుభూషణులు ఎత్తిపొడుస్తున్నారు.
 
 దారిద్య్రరేఖ నిర్ధారణ
 గ్రామీణ ప్రాంతంలో ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఆహార, ఆహారేతర అవసరాలకోసం రోజుకు రూ. 26లు కానీ అంతకంటే తక్కువ కానీ ఖర్చు చేస్తు న్నట్లయితే ఆ  కుటుంబం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్టు గుర్తిస్తున్నామనీ, అదే పట్టణ ప్రాంతమైతే  రూ. 32లు  కానీ అంత కంటే తక్కువగానీ ఖర్చు చే స్తున్న కుటుంబాన్ని పేదరికంలో  ఉన్నట్టు లెక్కిస్తున్నామనీ ప్రణాళికా సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నది. అనంతరం సురేష్ టెండూల్కర్ కమిటీ కుటుంబం ఖర్చు మొత్తాన్ని స్వల్పంగా హెచ్చించింది. ఒక కుటుంబానికి ఏమేమి వసతులు ఉన్నాయో తెలుసుకొని ఆ కుటుంబం పేదదా కాదా అనే నిర్ణయానికి వచ్చే పద్ధతి ఒకటి. ఎటువంటి ఇల్లు ఉంది? ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు? ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు? అక్షరాస్యత ఉన్నదా లేదా? పిల్లలు ఏమి చేస్తున్నారు? ఇటువంటివే మొత్తం 13 సూచీల ద్వారా సమాచారం సేకరించి ఫలానా కుంటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నదా లేదా అనే విషయం గుర్తించేవారు.
 
 2002లో జరిగిన ఇటు వంటి సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలో 28.3 శాతం కుటుంబాలూ, పట్టణ ప్రాంతంలో 27.5 కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నట్టు తీర్మానించారు. ఈ కుటుంబాలన్నిటికీ ఆహారం, గృహ నిర్మాణం, వైద్యం, విద్య వగైరా అంశాలలో ప్రభుత్వం ఇచ్చే  సబ్సిడీలు అన్నీ అందాలి. యూపీఏ ప్రభుత్వం 2011లో కొత్త సూచీల ఆధారంగా సరికొత్త సర్వే (సెక్)కు శ్రీకారం చుట్టింది. ద్విచక్ర, త్రిచక్ర వాహనం ఉన్నా,  కారు ఉన్నా, వ్యవసాయ పనిముట్లు ఉన్నా, క్రెడిట్‌కార్డు ఉన్నా, కుటుంబ సభ్యులలో ఒక్కరైనా రూ. 10,000లు లేదా అంతకు మించి ఆదాయం సంపాదిస్తున్నా, కుటుంబంలో ఎవరైనా ఆదాయం పన్ను కానీ వృత్తి పన్నుకానీ చెల్లిస్తున్నా (ఇటు వంటివే మొత్తం 14 సూచీలలో ఏ ఒక్క సూచీకి అవునని సమాధానం వచ్చినా) పేదరికం లేనట్టే.
 
 దీని ఫలితంగా గ్రామీణ భారతంలోని మొత్తం 17.91 కోట్ల కుటుంబాలలో 7.05 కోట్ల (39.39 శాతం) కుటుంబాలు దారిద్య్రరేఖకు ఎగువనే ఉంటాయి. వాటికి ప్రభుత్వ సబ్సిడీలు వర్తించవు. అదే విధంగా, గూడులేని వారూ, సఫాయి కార్మికులూ,  చట్టబద్ధంగా విముక్తి పొందిన కట్టు బానిసలూ, భిక్షాటనంపైన బతికేవాళ్లూ, అనాథలూ గ్రామీణ భారతంలో 16.50 లక్షల కుటుంబాలలో ఉన్నార ని సర్వే తేల్చింది. ఈ కుటుంబాలకు ప్రభు త్వ సాయం పూర్తిగా అందవలసి ఉంటుంది. సరైన ఇల్లు లేనివారికీ, దళితు లకూ, ఆదివాసీలకూ, అక్షరాస్యత లేని కుటుంబాలకూ, కూలిపని చేసుకొని బతి కులీడ్చేవారికీ అన్ని సంక్షేమ పథకాలు కాకుండా వారికి అవసరమైన పథకాల ద్వారా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉదాహరణకు ఒక్కగది మాత్రమే ఉన్న ఇంట్లో నివసిస్తున్నవారికీ ఇందిర గృహనిర్మాణ పథకం కింది ఇళ్ళు కట్టించాలి. ఇటువంటి కుటుంబాలు 8.69 లక్షలు ఉంటాయి. అంత్యోదయ పథకం మాదిరే వీరికి వెంటనే సహాయం అందించాలి.
 
 
 గ్రామీణ భారతంలో సుమారు రెండు కోట్ల కుటుంబాలకు ఏ లోటూ లేదు.  ఈ కుటుంబాలనూ, సూచీల ఆధారంగా చూసినప్పుడు  సబ్సిడీలు వర్తించని 7.05 కోట్ల  కుటుంబాలనూ కలిపితే మొత్తం 9.05  కుటుంబాలను ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి మినహాయించవచ్చునని ‘సెక్’ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రెండు  కుటుంబాలలో ఒక కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం వర్తించాలి. ఇంకా ఎక్కువ కుటుం బాలకు సంక్షేమ పథకాలను అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. 2002 నాటి సర్వే ప్రకారం 27.5 శాతం గ్రామీణ కుటుంబాలనే దారిద్య్రరేఖకు దిగు వన ఉన్నట్టూ, సంక్షేమ కార్యక్రమాలకు అర్హులైనవన్నట్టూ గుర్తించినప్పటికీ ఆహార సబ్సిడీలను అనేక రాష్ట్రాలు 45 శాతం గ్రామీణ కుటుంబాలకు అందిం చాయి. ప్రముఖ ఆర్థికవేత్త, ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ రంగరాజన్ నిరుడు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 31శాతం గ్రామీణ కుటుంబాలను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు గుర్తించాలని సిఫార్సు చేశారు. నిజంగా ఎంత మంది నిరుపేదలు గ్రామీణభారతంలో ఉన్నారో తాజా సర్వే శాస్త్రీయంగా లెక్క తేల్చింది.
 
 మోదీ మార్గం
 నరేంద్రమోదీకి ముందు 14మంది ప్రధానులు ఈ దేశాన్ని ఏలారు. ఎన్నెన్నో పథకాలు అమలు చేశారు. అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు. పేదరికం వెక్కిరిస్తూనే ఉంది. నరేంద్రమోదీ ప్రభుత్వం సైతం మరికొన్ని లక్షల కోట్లు ఖర్చు చేయవచ్చు. అయినా సరే, పేదరికం నిర్మూలించగలరనే నమ్మకం లేదు. మనం నేల విడిచి సాము చేస్తున్నాం. గ్రామాలను నిర్లక్ష్యం చేసి పట్టణా లను విస్తరించుకుంటూ పోతున్నాం. గ్రామాలలోనూ, పట్టణాలలోనూ ఉపాధి అవకాశాలు కల్పించలేక పోతున్నాం. ఇన్నేళ్ల నిర్వాకం తర్వాత పేదలకూ, సంపన్నులకూ మధ్య, గ్రామాలకూ, పట్టణాలకూ మధ్య అంతరం విపరీతంగా పెరిగింది. పల్లెసీమలు సస్యశ్యామలంగా ఉన్నప్పుడు పంటలు పండేవి. రైతులకూ, వ్యవసాయ కూలీలకే కాకుండా వృత్తిపనులవారికి చేతి నిండా పని ఉండేది. కడుపునిండా తిండి ఉండేది. అదంతా గతం. పల్లెను నాశనం చేసుకున్నాం. పొట్టపట్టుకొని పట్టణాలకు వచ్చినవారు ఉపాధి దొరకక అశాంతితో, ఆకలితో అలమటిస్తున్నారు.
 
 పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో చదువుకొని ఉపాధి లేక నైరాశ్యం ఆవరించిన యువత ఆవేశంతో ఎటు పోతుందోనన్న భయం ఆలోచ నాపరులను పట్టిపీడిస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా యువతీ యువకులు చిన్న ఎదురు దెబ్బ తగిలినా, నిరాశ కలిగినా తట్టుకోలేక ఆత్మ హత్యకు ఒడిగడుతున్నారు. వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలి. ఈ దేశంలో రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా సంపద పెంచుకుంటే ఆర్థికాభివృద్ధి ఫలాలు జాలువారి (ట్రికిలింగ్ ఎఫెక్ట్ థియరీ) కింద ఉన్న పేదలకు అందుతాయనీ, అది ఒక్కటే పేదరికం నిర్మూలనకు మార్గమనే వాదన ప్రస్తుత పాలక వర్గానిది. ఆర్థికాభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి కూడా పెద్దపీట వేయాలనే వాదన యూపీఏ సర్కార్‌ది. సామ్యవాదం వెనకబడింది. యూరప్‌లో సత్ఫలితాలు ఇచ్చిన అభివృద్ధి నమూనా భారత్ వంటి సువిశాల దేశంలో ఇవ్వకపోవచ్చు. సింగపూర్ వంటి చిన్న నగరరాజ్యంతో మనం పోల్చుకోవడం, దానిని అనుసరించడానికి వెంపర లాడటం వెర్రితనం. చైనా కూడా మూడున్నర దశాబ్దాల కిందటి వరకూ మన లాగే వ్యవసాయ ప్రధాన దేశం.
 
 1978లో ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత చైనా స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా క్రమంగా  తగ్గుతూ వచ్చింది. ఈ శాతం తగ్గడం వ్యవసాయరంగం ఉత్పత్తి పడిపోవడం వల్ల కాదు. చైనా ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పెరగడం వల్ల. ప్రస్తుతం వ్యవసాయం వాటా మన జీడీపీలో  13.9 అయితే చైనా జీడీపీలో 9.2 శాతం. అక్కడ రైతులు చితికిపోలేదు. ప్రభుత్వ అండదండలతో హాయిగా ఉన్నారు. చైనా పాలకులు  వ్యవసాయ ఉత్పత్తులకు ఆద్భుతమైన మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. రవాణా వసతులు కల్పించారు.  
 
 అనేక దేశాలకు చైనా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. అటువంటి ప్రయత్నమేదీ మన దేశంలో అవసరమైన స్థాయిలో జరగడం లేదు. మేక్ ఇన్ ఇండియా నినాదం మంచిదే. డిజైన్ ఇన్ ఇండియా కూడా స్వాగతించవలసిందే. ‘సెక్’ సర్వే ప్రకారం కూడా గ్రామీణ భారతంలో 30 శాతం కుటుంబాలు వ్యవసాయంపైన ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నాయి. పరోక్షంగా లక్షల కుటుంబాలు వ్యవసాయ రంగంపైన బతుకుతున్నాయి. సంస్కరణలంటే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీ ర్యం చేసి ప్రైవేటు చేతుల్లో పెట్టడం అనే తప్పుడు అవగాహన మన రాజకీయ నాయకులది. చైనాలో ఇప్పటికీ పెద్ద కంపెనీలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. చైనా పోస్టు ప్రపంచంలోనే అతి పెద్దది. చైనా బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే చాలా రెట్లు పెద్దది.
 
 మన వాళ్ళు చైనా వెళ్లి పెద్ద వ్యాపార సంస్థల ప్రతినిధులను కలిసి, వారికి భూములూ, విద్యుత్తూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తామంటూ హామీలు గుప్పించడం  కాకుండా వివిధ రంగాలలో  అభివృద్ధి సాధించడానికి చైనీస్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు ఏమిటో తెలుసు కొని వాటిని ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మలచుకొని అమలు చేయడం వివేకవంతులు చేయవలసిన పని.

ఇక్కడ పరిశ్రమలు మన చొరవతో, మన శ్రమతో, మన నైపుణ్యంతో అభివృద్ధి చెందాలి. ఉత్పత్తిరంగాన్ని వృద్ధి చేసుకోవాలి. సేవారంగంపైన మాత్రమే ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఒకానొక దశలో చతికిలపడుతుంది. ప్రణాళికా సంఘం విఫలమైన మాట యూపీఏ ప్రభుత్వమే అంగీకరించింది. దారిద్య్రరేఖను నిర్ణయించే విధానం మారాలని కూడా యూపీఏ సర్కార్ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ఇంటా బయటా యూపీఏనీ, మన్మోహన్‌సింగ్‌నూ, సోనియాగాంధీనీ ఆడిపోసుకోవడం మాని మోదీ గట్టి మేలు తలపెట్టాలి.  తాజాగా వెల్లడైన ‘సెక్’ గణాంకాల దృష్ట్యా పేదరికాన్ని పారదోలడానికి సరైన వ్యూహాలు రచించి సమర్థంగా అమలు చేయవలసిన బాధ్యత ఎన్‌డీఏ సర్కార్‌ది.  
- కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement