
సాక్షి, పాట్నా : బీహార్లో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ అంతరాయంతో సహర్షాలోని సదర్ ఆస్పత్రిలో ఓ మహిళకు టార్చ్లైట్ వెలుగులో వైద్యులు ఆపరేషన్ చేయడం కలకలం రేపింది. స్పృహలేని స్థితిలో బెడ్పై ఉన్న మహిళకు టార్చ్ వెలుగులో కుట్లు వేస్తున్న వీడియో బహిర్గతమైంది. ఆమె చుట్టూ పలువురు సిబ్బంది ఉండగా తెలుపు రంగు దుస్తుల్లో ఉండాల్సిన వైద్యులు ఖాకీ షర్ట్తో కనిపించడం గమనార్హం.
ఆస్పత్రిలో జనరేటర్ లేకపోవడంతో అత్యవసరంగా టార్చ్లైట్ వెలుగులోనే సర్జరీ చేసినట్టు చెబుతున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు ఇంతవరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులు సైతం ఈ ఘటనపై ఇంకా నోరుమెదపలేదు. కాగా, ఖగారియాలో ఇటీవల మొబైల్ ఫోన్ వెలుగుతో ఆపరేషన్లు నిర్వహించిన ఘటన నేపథ్యంలో ఈ ఉదంతం వెలుగుచూసింది. గత ఏడాది డిసెంబర్లో ఇదే తరహాలో యూపీలోని ఉన్నావ్ జిల్లాలో 32 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించినట్టు వార్తలు వచ్చాయి.