పెళ్లి కోసం ఏకంగా 80 కి.మీ. నడిచింది! | Woman In Kanpur Walks 80 km Kannauj Alone To Get Married | Sakshi
Sakshi News home page

80 కి.మీ. నడిచి వరుడిని చేరుకుంది!

May 23 2020 3:47 PM | Updated on May 23 2020 4:14 PM

Woman In Kanpur Walks 80 km Kannauj Alone To Get Married - Sakshi

లక్నో: పెళ్లి కోసం ఏకంగా ఓ యువతి 80 కిలోమీటర్లు నడిచింది. ఒంటరిగా సుదీర్ఘ ప్రయాణం చేసి వరుడిని చేరి మూడు ముళ్లు వేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... కాన్పూర్‌లోని తిలక్‌ గ్రామానికి చెందిన గోల్డి(20)కి కనౌజ్‌కు చెందిన వీరేంద్ర కుమార్‌(23)తో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో మే 4న పెళ్లి తంతు జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. కాగా కరోనా విజృంభించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో రోజూ ఫోన్లో మాట్లాడుకున్న వధూవరులు అనుకున్న తేదీకి పెళ్లి జరుగలేదని డీలాపడిపోయారు. దీంతో ఎలాగైనా వీరేంద్రను కలిసి తీరాలని నిశ్చయించుకున్న గోల్డి.. కనౌజ్‌కు నడక ప్రారంభించి బుధవారం అక్కడికి చేరుకుంది. ఊహించని విధంగా కాబోయే కోడలు ఇంట అడుగుపెట్టడంతో ఆశ్చర్యపడిన అత్తింటి వారు ఓ ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఓ సామాజిక కార్యకర్త సమక్షంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ నిబంధనల ప్రకారం పెళ్లి జరిపించారు. (కొత్తజంటకు పోలీసుల వైరైటీ రిసెప్షన్‌)

కాగా ఎరుపు రంగు చీర కట్టుకుని గోల్డి, తెల్లటి చొక్కా వేసుకుని వీరేంద్ర మాస్కులు ధరించి అగ్నిహోత్రం ముందు కూర్చున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో జంటలు నిబంధనల ప్రకారం ఇంట్లోనే పెళ్లిచేసుకోవడం, వధువు కోసం వరుడు, వరుడి కోసం వధువు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి. కాగా యూపీలో ఇప్పటి వరకు 5700 కేసులు నమోదు చేయగా.. 130 మంది మరణించారు.(వాట్సాప్‌ మెసేజ్‌తో కలకలం)

Advertisement
 
Advertisement
Advertisement