ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం కింద రూ.700 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు.
లోక్సభలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం కింద రూ.700 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఈ మొత్తంలో రాష్ట్ర రాజధానికి రూ.350 కోట్లు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించామని తెలిపారు. కాగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒకసారి సాయం కింద రూ.2000 కోట్లను ఈ ఏడాది కేంద్రబడ్జెట్లో కేటాయించినట్టు ఆయన చెప్పారు. లోక్సభలో శుక్రవారం ఏఐఏడీఏంకే సభ్యుడు ఎం.చంద్రకాశి అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికున్న మార్గదర్శకాలేమిటీ? ఇకముందు ‘హోదా’ ఇవ్వకుండా రద్దు చేసే ప్రతిపాదనుందా? అని చంద్రకాశి అడగ్గా.. మంత్రి సూటిగా బదులివ్వలేదు.
ఏపీకి పన్ను రాయితీ ప్రతిపాదనేదీ లేదు: హిమాచల్ప్రదేశ్ తరహాలో ఏపీకి పన్ను రాయితీపై ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ఏపీకి పన్ను రాయితీపై లోక్సభలో ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, నాని, బీబీ పాటిల్, అసదుద్దీన్ ఒవైసీలు అడిగిన ప్రశ్నకు శుక్రవారం మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.