ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం | suspicious bag was found at Mangaluru Airport  | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం

Jan 20 2020 5:04 PM | Updated on Jan 20 2020 5:09 PM

 suspicious bag was found at Mangaluru Airport  - Sakshi

సాక్షి, బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. టికెట్‌ కౌంటర్‌ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్నవిమానాశ్రయ పోలీసులు, ఉన్నతా ధికారులకు సమాచారం అందించారు.  దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న  నగర పోలీసులకు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీఎస్‌)  ఆ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వెహికల్‌లో ఉంచి, కిలోమీటరు దూరంలో కెంజార్‌లోని బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పరిశీలిస్తున్నారు. బ్యాగ్‌లో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, అందులో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉంచారని పోలీసు వర్గాలు తెలిపాయి. 

ఈ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహిరింపచేసిన అధికారులు  ఎయిర్‌పోర్టులో హై అలర్ట్‌ ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు నిందితుడి ఫోటోలను  విడుదల చేశారు.అలాగే నిందితుడు వెళ్లిన ఆటోరిక్షాను  ఫోటోను కూడా రిలీజ్‌ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) డిఐజి అనిల్ పాండే అందించిన సమాచారం ప్రకారం నిందితుడు బ్యాగ్‌ను మంగళూరు విమానాశ్రయంలో ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో అక్కడినుంచి ఉడాయించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అలాగే బాంబును నిర్వీర్యం చేసేందుకు సంబంధిత సిబ్బంది పనిచేస్తున్నారని పాండే చెప్పారు. అలాగే అన్ని విమాన సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని  విమానాశ్రయ డైరెక్టర్ వి.వి. రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement