
ఇక్కడ సెల్ఫీ వద్దు!
అనేక సందర్భాల్లో వివిధ దేశాల నాయకులతో పాటు ప్రజలతో సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకునే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ అద్భుతమైన ఘట్టంలో మాత్రం అందుకు దూరంగా ఉన్నారు.
న్యూఢిల్లీ: అనేక సందర్భాల్లో వివిధ దేశాల నాయకులతో పాటు ప్రజలతో సెల్ఫీలు దిగుతూ ఆకట్టుకునే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ అద్భుతమైన ఘట్టంలో మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలోని రాజ్ పథ్ కు హాజరైన మోదీతో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఆసక్తి కనబరిచారు.
తొలుత యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన ఓ మహిళ మోదీతో సెల్ఫీ దిగడానికి ఉత్సుకత చూపింది. ఒక సెల్ఫీ కావాలంటూ మోదీకి విన్నవించింది. అయితే ఇప్పుడు సెల్ఫీ వద్దంటూ ఆమె కోరికను మోదీ సుతిమెత్తగా తిరస్కరించారు. అనంతరం మోదీ యోగాసనాల్లో నిమగ్నమవ్వగా.. ఇక చేసేది లేక ఆమె కూడా యోగా శిక్షణలో మునిగిపోయింది. అటు తరువాత మరో వ్యక్తి కూడా మోదీతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపాడు. అయితే దీనిని గమనించిన సివిల్ డ్రెస్ లో ఉన్న ప్రధాని సెక్యూరిటీ వారిని అక్కడ నుంచి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.
రాజపథ్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దాదాపు 35 వేలకు మందికి పైగా ప్రజలు పాల్గొని వివిధ రకాలైన ఆసనాలతో ఆకట్టుకున్నారు.