
నేను ఉన్నంత వరకు చిచ్చు పెట్టలేరు: ములాయం
తమది పెద్ద కుటుంబం కాబట్టి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు గానీ, తాను ఉన్నంత కాలం పార్టీలో చీలిక రాదని, అప్పటివరకు కుటుంబంలో ఎవరూ చిచ్చు పెట్టలేరని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు.
తమది పెద్ద కుటుంబం కాబట్టి అభిప్రాయ భేదాలు ఉండొచ్చు గానీ, తాను ఉన్నంత కాలం పార్టీలో చీలిక రాదని, అప్పటివరకు కుటుంబంలో ఎవరూ చిచ్చు పెట్టలేరని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఆయన తన తమ్ముడు శివపాల్ యాదవ్, కొడుకు అఖిలేష్ యాదవ్లతో విడివిడిగా భేటీ అయ్యారు. అఖిలేష్ తన మాట ఎట్టి పరిస్థితుల్లో కాదనడని, ఆ నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ఒక కుటుంబమని, ఇంత పెద్ద కుటుంబంలో అభిప్రాయ భేదాలు మామూలేనని తెలిపారు. మామూలుగా తండ్రీ కొడుకుల మధ్య కూడా తేడాలు వస్తాయని అన్నారు. ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవని, మీడియాతో మాట్లాడిన తమవాళ్లు చేసిన పొరపాటు వల్లే అలా జరిగిందని తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి అంతా కలిసి పనిచేయాలని.. అఖిలేష్, రాంగోపాల్ యాదవ్, శివపాల్ యాదవ్.. ఈ ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అఖిలేష్ వెళ్లి శివపాల్ యాదవ్ను ఆయన ఇంట్లో కలుస్తారన్నారు. అయితే.. ములాయం ఇంట్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా, తనకు రెండు విధులున్నాయని, ఒకటి ముఖ్యమంత్రిగాను.. మరొకటి ఒక కొడుకు గాను ఉండాల్సి ఉంటుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడి మాటలను తాను గౌరవిస్తానని, తన తండ్రిని సంతోషంగా ఉంచడానికి ఏం చేయాలో అంతా చేస్తానని ఆయన చెప్పారు. మంత్రి పదవికి శివపాల్ యాదవ్ చేసిన రాజీనామాను ఆయన తిరస్కరించారు.