వికాస్ సోదరులకు అయిదేళ్ల జైలుశిక్ష తగ్గింపు | Nitish Katara murder: Convicts Vikas, Vishal Yadav get 25 yrs in jail | Sakshi
Sakshi News home page

వికాస్ సోదరులకు అయిదేళ్ల జైలుశిక్ష తగ్గింపు

Oct 3 2016 6:28 PM | Updated on Sep 2 2018 5:24 PM

సంచలనం సృష్టించిన నితీష్ కఠారా హత్యకేసులో దోషులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

న్యూఢిల్లీ : 2002లో సంచలనం సృష్టించిన నితీష్ కఠారా హత్యకేసులో దోషులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోదరిని ప్రేమించాడన్న కారణంగా బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ నితీష్ను దారుణంగా హతమార్చిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్లకు న్యాయస్థానం అయిదేళ్ల శిక్ష కాలాన్ని తగ్గించింది.  ఆ కేసుతో గత ఏడాది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ముఫ్పై ఏళ్ల జైలుశిక్షను పాతికేళ్లకు తగ్గిస్తూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే  ఈ కేసులో మరో దోషిగా ఉన్న సుఖ్దేవ్ పెహల్వాన్కు ఇరవై ఏళ్లు జైలు శిక్షను సమర్థించింది.

కాగా 2002లో నితీష్, వికాస్ యాదవ్ సోదరి భారతి ఢిల్లీ శివారులో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అయితే తన సోదరితో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని యాదవ్ సోదరులు నితీష్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. వీరికి సుఖ్దేవ్ పెహల్వాన్ సహకరించాడు. యాదవ్ సోదరులు మాజీ ఎంపీ డీపీ యాదవ్ కుమారులు కాగా, నితీష్ విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడు.

ఈ కేసును విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు యాదవ్ సోదరులతో పాటు సుఖ్దేవ్కు జీవిత శిక్ష విధించింది. వీరికి మరణశిక్ష విధించాలని నితీష్ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నితీష్ తల్లి అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు.. నిందితులకు 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే  ఈకేసులో తీర్పును వెల్లడించిన కోర్టు శిక్షా కాలాన్ని అయిదేళ్లు తగ్గించింది.

Advertisement
 
Advertisement
Advertisement