
బిచ్చమెత్తుకునేలా చేయకండి
వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో రాష్ట్రాల ఆస్తులు కేంద్రం చేతిలో పెట్టినట్టు అవుతోందని, నిధుల కోసం రాష్ట్రాలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు కల్పించకుండా కేంద్రం వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- జీఎస్టీపై కేంద్రానికి స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ఆర్థిక మంత్రుల సమావేశంలో మంత్రి ఈటల
సాక్షి, న్యూఢిల్లీ : వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో రాష్ట్రాల ఆస్తులు కేంద్రం చేతిలో పెట్టినట్టు అవుతోందని, నిధుల కోసం రాష్ట్రాలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు కల్పించకుండా కేంద్రం వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను ఈటల ఏపీ భవన్లో మీడియాకు వివరించారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదానికి రానుండడంతో దీనిపై అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు ఈటల తెలిపారు.
వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే జీఎస్టీకి మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. జీఎస్టీ ఒకే పన్ను విధానంలో రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉండాలని, ఆ నిధులపై రాష్ర్ట ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉండాలని, జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడే న ష్టపరిహారాన్ని నాలుగు, ఐదు ఏళ్లకు కాకుండా, మూడు, ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేలా చట్టంలో పొందుపరచాలని, పన్ను ఎగవేతదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జీఎస్టీని పారదర్శకంగా అమలు చేయాలని, జీఎస్టీ అమలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగేలా చూడాలని చేసిన ప్రతిపాదనలకు సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందని ఈటల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
జీఎస్టీ వల్ల తెలంగాణకు కొన్ని రంగాల్లో ఉపయోగం, మరికొన్నింటిలో నష్టాలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఈటల కొట్టిపారేశారు. తెలంగాణ రాష్ట్రం రూ. 70 వేల కోట్ల అప్పుతో ఏర్పడిందని, అప్పులు ఎంతపడితే అంతా తెచ్చుకొనే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రాల అప్పులు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలకు లోబడి ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీలో కేంద్ర ప్రభుత్వ చట్టప్రకారంగా ఎఫ్ఆర్బీఎం 3 శాతంగా ఉందని, 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా దీనిని మరో 0.25 శాతం పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు వేలకోట్లు అప్పులు చేసే పరిస్థితిలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ విషయాలను అర్థంచేసుకొని విమర్శలు చేయాలన్నారు.