రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవం
జైపూర్ : రాజస్ధాన్ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్లో కాంగ్రెస్కు మెజారిటీ ఉండటంతో ఇతర పార్టీలు అభ్యర్థుల్ని పోటీకి దింపలేదు. ఇక నామినేషన్ ఉపసంహరణ తేదీ సోమవారం ముగియడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది. మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజస్తాన్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ మన్మోహన్కు అభినందనలు తెలిపారు.